మృగాళ్లు: బెంగళూరులో ఉద్యోగం ఇప్పిస్తాం: అపార్ట్ మెంట్ లో గ్యాంగ్ రేప్
27 ఏళ్ల వివాహిత మహిళకు ప్రసిద్ది చెందిన కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని బెంగళూరు పిలిపించి ఓ అపార్ట్ మెంట్ లో నలుగురు కామాంధులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకరి తరువాత ఒకరు సామూహిక అత్యాచారం చేశారు.
బెంగళూరు: ప్రసిద్ది చెందిన కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి అపార్ట్ మెంట్ లో వివాహిత మహిళ మీద కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. నలుగురు కామాంధుల మీద బెంగళూరు ఉత్తర విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉత్తర కన్నడ జిల్లాలో 27 ఏళ్ల వివాహిత నివాసం ఉంటున్నారు. ఈమె బెంగళూరులో ఉద్యోగం సంపాదించాలని, ఇక్కడే ఆశ్రమంలో ఉన్న పిల్లలను చూసుకోవాలని ఆశతో కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈమెకు బెంగళూరులో నివాసం ఉంటున్న మంజు అనే వ్యక్తి పరిచయం ఉన్నాడు, గత మంగళవారం రాత్రి మంజు ఆమెకు ఫోన్ చేసి బుధవారం ఉదయం నీవు బెంగళూరులో ఉండాలని, ఇంటర్వూ ఉందని, నీకే ఉద్యోగం వస్తుందని ఫోన్ చేసి చెప్పాడు.
మంజు మాయమాటలు నమ్మిన ఆమె బుదవారం ఉదయం బెంగళూరు చేరుకుని జాలహళ్ళి క్రాస్ దగ్గర బస్సు దిగింది. అక్కడికి మంజు ఆటోలో వెళ్లాడు. ఆమెను ఆటోలో పిలుచుకుని బయలుదేరాడు. మంజుతో పాటు ఆటో డ్రైవర్ సీటులో ఓ వ్యక్తి కుర్చున్నాడు.
మార్గం మధ్యలో మరో ఇద్దరు ఆటోలో ఎక్కారు. ఆ సమయంలో ఆమెకు అనుమానం వచ్చి ఎవరు వీరు అని మంజును ప్రశ్నించింది. నీకు ఇంటర్వూలో సహాయం చేస్తారని, వీరే నీకు ఉద్యోగం ఇప్పిస్తారని ఆమెను నమ్మించాడు.
తరువాత ఆమెను ఓ అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లోకి తీసుకువెళ్లారు. నీవు త్వరగా స్నానం చేసి రెడీ అయితే ఇంటర్వూకు వెలుదామని, మేము బయటకు వెళ్లి వస్తామని ఆమెకు చెప్పి నలుగురు ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లారు. ఆమె డోర్ లాక్ చేసుకుని స్నానం చేసి రెడీ అయ్యింది.
అర్దగంట తరువాత మళ్లీ నలుగురు ఫ్లాట్ కు చేరుకున్నారు. నేను రెడీ అయ్యానని ఇంటర్వూకు వెలుదామని ఆమె చెప్పింది. అంతే ఓ వ్యక్తి ఆమె మెడ మీద కత్తిపెట్టాడు. చెప్పినట్లు వినకుంటే చంపేస్తామని బెదిరించాడు.
ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటలకు వరకు ఒకరి తరువాత ఒకరు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. వివాహిత మహిళ పట్ల నలుగురు మృగాళ్లు క్రూరంగా ప్రవర్తించారు. అనంతరం ముగ్గురు నిందితులు బయటకు వెళ్లి వస్తామని ఓ వ్యక్తిని ఆమెకు కాపలాపెట్టి వెళ్లారు.
ఫ్లాట్ లో ఉన్న ఆ వ్యక్తి కొద్ది సేపటికి బాత్రూంలోకి వెళ్లాడు. బాత్రూమ్ బయట గోళ్లెం పెట్టిన ఆమె అపార్ట్ మెంట్ నుంచి బయటకు వచ్చి పారిపోయి ఆటోలో మెజస్టిక్ చేరుకుంది. అక్కడి నుంచి బస్సులో హోరమావు చేరుకుని ఆశ్రమంలో ఉన్న తన పిల్లలను పలకరించింది.
అదే రోజు రాత్రి 11.30 గంటలకు మెజస్టిక్ చేరుకుని బస్సులో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు సొంత ఊరికిచేరుకునింది. బెంగళూరులోని హోరమావు ఆశ్రమంలో ఉన్న పిల్లల భవిష్యత్తు చూసుకోవడానికి ఆమె బెంగళూరులో ఉద్యోగం చెయ్యాలని ఆశపడింది.
తరువాత పోలీసు కంట్రోల్ రూం, హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారుల సూచన మేరకు మళ్లీ బెంగళూరు చేరుకుంది. బెంగళూరు పోలీసులు ఆమెను వెంట పెట్టుకుని అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లారు. అక్కడ మంజు అనే కామాంధుడిని బాధితురాలు గుర్తు పట్టింది.
మరో ముగ్గురు కామాంధుల వివరాలను పోలీసులు సేకరించారు. పోలీసులు మంజును బెండ్ తీసి వివరాలు సేకరించారు. బాధితురాలిని వైద్య పరిక్షలకు తరలించామని, నిందితులను విచారిస్తున్నామని బెంగళూరు ఉత్తర విభాగం పోలీసు అధికారులు తెలిపారు.