తాజ్ మహల్ వద్ద గొంతులు కోసుకున్న లవర్స్
ఆగ్రా: మతాలు వేరుకావడంతో కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆగ్రాలో జరిగింది. ఇద్దరి గొంతులు తెగిపోవడంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు.
నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే ప్రసిద్ధి చెందిన ఆగ్రాలోని తాజ్ మహల్ దగ్గర ఈ సంఘటన జరిగింది. డెహ్రాడూన్ కు చెందిన రాజవీర్ సింగ్ (25), ఆగ్రాలోని కర్బాలా ప్రాంతంలో నివాసం ఉంటున్న షబ్నం (23) కొన్ని సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు.
ఇద్దరి మతాలు వేరుకావడంతో వీరి కుటుంబ సభ్యులు పెళ్లి చెయ్యడానికి నిరాకరించారు. జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు బుధవారం సాయంత్రం తాజ్ మహల్ దగ్గరకు వెళ్లారు. తరువాత బ్లేడ్ లు తీసుకుని గొంతులు కొసుకున్నారు.
రక్తపుమడుగులో పడి ఉన్న విషయం గుర్తించిన పర్యాటకులు హడలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇద్దరిని ఎస్ఎస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని పోలీసు అధికారులు చెప్పారు.
పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడం వలనే ఆత్మహత్యాయత్నం చేశామని రాజవీర్ సింగ్ ఆగ్రా మెజిస్ట్రేట్ కు వాంగ్మూలం ఇచ్చాడు. ఆసుపత్రి చేరుకున్న షబ్నం కుటుంబ సభ్యులు ఇద్దరి పెళ్లి చేస్తామని పోలీసులకు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.