తగ్గుముఖం.. తెలుగు రాష్ట్రాల్లో 100 లోపు కేసులు..తెలంగాణ, ఏపీలో ఇలా
కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 16వేల 241 కరోనా పరీక్షలు నిర్వహించారు. 52 మందికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్లో అత్యధికంగా 25 కొత్త కేసులు వచ్చాయి. పలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. మరో 91 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా, గడిచిన ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం.
తెలంగాణలో ఇప్పటిదాకా 7,90,689 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,85,840 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 738 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ తో 4వేల 111 మంది మరణించారు. క్రితం రోజు రాష్ట్రంలో 22వేల 400 కరోనా పరీక్షలు నిర్వహించగా, 63 పాజిటివ్ కేసులు వచ్చాయి.
ఇటు ఏపీలో గడిచిన 24 గంటల్లో 11వేల 846 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 75మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 46 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,31,14,755 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 730గా ఉంది. రాష్ట్రంలో ఇంకా 536 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,19,141 పాజిటివ్ కేసులు నమోదవగా.. 23,03,875 మంది కోలుకున్నారు.
దేశంలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 3వేలకు దిగువనే నమోదవుతున్నాయి. నిన్న 6 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేయించుకోగా.. 2వేల 528 మందికి పాజిటివ్గా తేలింది. మరోపక్క మరణాల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముందురోజు ఆ సంఖ్య 60గా ఉండగా.. 24 గంటల వ్యవధిలో 149కి చేరింది. కేరళలో కరోనా లెక్కలు సవరిస్తుండటమే ఈ భారీ వ్యత్యాసానికి కారణం. ఇక ఇప్పటివరకు 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం 30వేల దిగువకు చేరి.. మొత్తం కేసుల్లో 0.07 శాతానికి క్షీణించాయి. నిన్న 3వేల 997 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 4.24 కోట్లు(98.73 శాతం) దాటాయి. మరోపక్క దేశంలో టీకా కార్యక్రమం దశలవారీగా ముందుకు సాగుతోంది. ఇప్పటివరకూ 180.9 కోట్ల డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం తెలిపింది. నిన్న 15.7 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఈ మేరకు కేంద్రం శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.