హిందీ వ్యతిరేక ఉద్యమం: మోడీకి స్టాలిన్ హెచ్చరిక
హైవే మార్కర్స్ పైన ఇంగ్లీష్ను తొలగించి, హిందీని రాయడంపై డీఎంకే అధినేత స్టాలిన్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై: హైవే మార్కర్స్ పైన ఇంగ్లీష్ను తొలగించి, హిందీని రాయడంపై డీఎంకే అధినేత స్టాలిన్ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే చేస్తే హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభిస్తామని కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
తమిళనాడుపై హిందీ రుద్దడాన్ని తాము సహించేది లేదని అంటున్నారు. తమిళ ప్రజలపై కేంద్రం దొడ్డిదారిన హిందీని రుద్దే ప్రయత్నం చేస్తోందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళ భాషను పక్కకు తప్పించి, హిందీని రుద్దాలనుకుంటే హిందీకి వ్యతిరేకంగా ఓ ఉద్యమం పుట్టుకు వస్తుందన్నారు. వెల్లూరు - కృష్ణగిరి జిల్లాల జాతీయ రహదారుల్లో సైన్ పోస్టులు, మైల్ స్టోన్లపై హిందీ ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక హిందీని, సంస్కృతాన్ని రుద్దే ప్రయత్నం చేస్తోందన్నారు. హిందీని బలవంతంగా రుద్దవద్దని, ఇంగ్లీష్ స్థానంలో హిందీని రాయవద్దని స్టాలిన్ కేంద్రాన్ని హెచ్చరించారు.
జాతీయ రహదారులపై ఉన్న హిందీ సైన్ బోర్డులను తమిళంలోకి మార్చాలని కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేశమంతా త్రిభాషా సూత్రం అమలు చేయాలని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను తమిళనాడు పాటించడం లేని విషయం తెలిసిందే.