మధిరలో తీవ్ర విషాదం: మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కన్నుమూత
ఒకప్పుడు కమ్యూనిస్టు ఖిల్లగా వెలుగొందిన ఖమ్మం జిల్లాలో సీపీఎం ముఖ్యనేతగా, మధిర అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన కట్టా వెంకట నర్సయ్య ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చికిత్స పొందుతూనే శుక్రవారం రాత్రి తన సొంతింట్లో కన్నుమూశారు. చనిపోయేనాటికి కట్టా వయసు 87 ఏళ్లు.
మధిర శాసనసభ స్థానం నుంచి కట్టా వెంకట నర్సయ్య రెండుసార్లు సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, 2009 శాసనసభ ఎన్నికలకు ముందు సొంత పార్టీపై తిరుబావుటా ఎగరేశారు. పార్టీ విధానాలు, రాష్ట్ర అగ్రనాయకత్వం తీరు నచ్చక సీపీఎం నుంచి వైదొలగిన ఆయన.. గడువుకు ముందే తన శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.

చనిపోయేంత వరకు కమ్యూనిస్టుగానే ఉంటానని చెప్పిన కట్టా వెంకట నర్సయ్య.. సీపీఎం నుంచి వైదొలగిన తర్వాత వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా సున్నితంగా తిరస్కరించారు. విద్యార్థి ఉద్యమాల నుంచే యుక్త వయసులోనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. కట్టా మృతి పట్ల సీపీఎం సహా పలు పార్టీల నేతలు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications