Viral video : సంతోషం పట్టలేక ఈ మందుబాబు ఏం చేశాడో చూడండి...
లాక్డౌన్ అనగానే అందరి కన్నా ఎక్కువ హైరానా పడేది మందు బాబులే. ఆగమేఘాల మీద లిక్కర్ షాపుల వద్దకు పరిగెత్తి మద్యం స్టాక్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు. గతేడాది కేంద్రం అకస్మాత్తుగా లాక్డౌన్ విధించడంతో మందు బాబులు ఎంతలా డీలా పడిపోయారో తెలిసిందే. అన్లాక్ ప్రక్రియ మొదలవగానే లిక్కర్ షాపుల ముందు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపించాయి. దాదాపు రెండు నెలల తర్వాత లిక్కర్ షాపులు తెరుచుకోవడంతో.. అప్పుడు గానీ మందు బాబుల మనసు కుదుటపడలేదు. తాజాగా తమిళనాడులో లిక్కర్ షాపులు తెరుచుకోవడంతో... సంతోషం పట్టలేక ఓ మందుబాబు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తెరుచుకున్న లిక్కర్ షాపులు...
తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జూన్ 29 వరకు లాక్డౌన్ విధించింది. ఇటీవల ఆంక్షలను సడలించిన ప్రభుత్వం 27 జిల్లాల్లో లిక్కర్ షాపులకు అనుమతినిచ్చింది. దీంతో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పోరేషన్(TASMAC) ఆధ్వర్యంలో నడుస్తున్న లిక్కర్ షాపులు తెరుచుకున్నాయి. లాక్డౌన్ కారణంగా మందు దొరక్క అల్లాడిపోయిన మందు బాబులు ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో మందు సీసాల కోసం లిక్కర్ షాపు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి... ఆ లిక్కర్ బాటిళ్లకు పూజలు చేసి దండాలు పెట్టాడు.
లిక్కర్ బాటిళ్లకు దండాలు...
మధురైలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా టస్మాక్ ఆధ్వర్యంలో నడుస్తున్న లిక్కర్ షాపు వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి... మొదట హారతి కర్పూరం వెలిగించాడు. ఆ తర్వాత మద్యం సీసాలు తీసుకొచ్చి హారతి ముందు పెట్టి... వాటికి పలుమార్లు దండం పెట్టుకున్నాడు. అతన్ని చూసి మరో వ్యక్తి కూడా అక్కడికి వచ్చి అదే తరహాలో చేశాడు. హారతి ముందు మందు సీసాలు పెట్టి దండం పెట్టుకున్నాడు. మందు బాబులు మద్యాన్ని ఎంతగా ఆరాధిస్తారో చెప్పేందుకు ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గతంలోనూ ఇలాంటి వీడియోలు
గతంలోనూ ఇలాంటి వీడియోలు చాలానే వెలుగుచూశాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఓ పెద్దావిడకు సంబంధించిన వీడియో కూడా ఇలాగే వైరల్ అయింది. లిక్కర్ షాపు వద్ద క్యూ లైన్లో నిలుచుకున్న ఆ మహిళ... 'ఏ మందు,ఇంజెక్షన్ కరోనాను నయం చేయలేదు... ఒక్క లిక్కర్ తప్ప...' అని వ్యాఖ్యానించారు. ఆమె మాటలకు చాలామంది ఆశ్చర్యపోయారు. అంతేనా... ఒకానొక దశలో లిక్కర్ సేవిస్తే కరోనా దరి చేరదన్న ప్రచారం కూడా హోరెత్తింది. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. పైగా మద్యం సేవించేవారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందన్నారు. ఫలితంగా వారే త్వరగా వ్యాధి బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.