'మధుసూదన్ను శశికళ బెదిరించింది.. పోరాడకపోతే అమ్మ ఆత్మ క్షమించదు'
ఇప్పుడు గనుక తాను పోరాడకపోతే అమ్మ జయలలిత ఆత్మ తనను ఎన్నటికీ క్షమించదని ఆయన వ్యాఖ్యానించారు.
చెన్నై: తమిళ రాజకీయాల్లో శశికళ ఆధిపత్యానికి చెక్ చెప్పేందుకు ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వేగంగా పావులు కదుపుతున్నారు. శశికళ వర్గం నుంచి ఒక్కో ఎమ్మెల్యే జారిపోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో.. దానికి బలం చేకూర్చేలా పన్నీర్ ఎమ్మెల్యేలను కొనేస్తారని శశికళ ఆరోపించిన సంగతి తెలిసిందే.
శశికళ తాజా ఆరోపణలపై పన్నీర్ సెల్వం స్పందించారు. ఇన్ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావుకు స్వాగతం పలకడానికి చెన్నై ఎయిర్పోర్టుకి బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడింగ్ చైర్మన్ మధుసూదన్తో పన్నీర్ భేటీ అయ్యారు.
ఈ సందర్బంగా పన్నీర్ సెల్వం మాట్లాడుతూ.. మధుసూదన్ను శశికళ బెదిరించిందని ఆరోపించారు. మధుసూదన్ తనకు మద్దతు ఇవ్వడాన్ని సమర్థిస్తున్నానని వ్యాఖ్యానించిన పన్నీర్.. ఇప్పుడు గనుక తాను పోరాడకపోతే అమ్మ జయలలిత ఆత్మ తనను ఎన్నటికీ క్షమించదని ఆయన వ్యాఖ్యానించారు.
మధుసూదన్ చేరికతో తనకు మరింత బలం చేకూరిందని, పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన చెప్పారు. శశికళ చేస్తోన్న ఆరోపణలకు గట్టిగా సమాధానం చెప్పడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. శశికళ అరాచాకాలకు చెక్ పెడుతామని, సీఎం పదవి కోసం చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆమెపై మండిపడ్డారు.
ఇక జయలలిత మృతి గురించి ప్రస్తావిస్తూ.. అమ్మ ఆసుపత్రిలో చేరిన 24 రోజుల తరువాత శశికళ తనతో మాట్లాడారని అన్నారు. ఆ సమయంలో అమ్మ కోలుకుంటున్నారని తనతో చెప్పారని పేర్కొన్నారు. జయలలిత మృతిపై కచ్చితంగా విచారణ జరిపించి తీరుతామని చెప్పారు.