Viral Video : సింగర్గా మారిన సీఎం... హుషారెత్తించాడు... వైరల్ అవుతున్న వీడియో..
మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలి... ఇది ఓ పాపులర్ సినిమా డైలాగ్. ఎప్పుడూ సీరియస్ పాలిటిక్స్లో మునిగి తేలే రాజకీయ నేతలు సైతం అప్పుడప్పుడు ఆటవిడుపుగా తమలోని కళను బయటపెడుతుంటారు.తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సింగర్ అవతారమెత్తారు. సీఎంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా గొంతు కలిపారు. ఇంకేముంది... ఇద్దరూ జోరుగా,హుషారుగా పాటను ఆలపించారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ వేదికగా జరిగిన బుట్టా పార్టీ కార్యక్రమంలో మొదట ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 'యే దోస్తీ హమ్ నహీ తోడేంగే' అనే పాట అందుకున్నారు. బాలీవుడ్ ఎవర్ క్లాసికల్ హిట్ షోలే సినిమాలోనిది ఈ పాట. చౌహాన్ పాట అందుకోగానే...అక్కడే ఉన్న కైలాష్ విజయ్ వర్గియా ఆయనతో శృతి కలిపారు. ఇద్దరూ కలిసి హుషారుగా పాట పాడుతూ అక్కడున్నవారిని అలరింపజేశారు.చివరలో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కైలాష్ విజయ్ వర్గియా ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. అప్పట్లో బీజేపీ యువ మోర్చాలో పనిచేస్తున్న సమయంలో చౌహాన్తో కలిసి పాటలు పాడిన రోజులను గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేసి.. అమితాబ్ బచ్చన్,ధర్మేంద్రలను ట్యాగ్ చేశారు. 1975లో విడుదలైన షోలే చిత్రంలో జై,వీరు పాత్రల్లో అమితాబ్,ధర్మేంద్ర నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా బాలీవుడ్ను ఒక ఊపు ఊపింది. అందుకే ఎవర్గ్రీన్ క్లాసిక్గా నిలిచిపోయింది.
కాగా,మధ్యప్రదేశ్ అసెంబ్లీ వేదికగా జరిగిన బుట్టా పార్టీలో అధికార,ప్రతిపక్ష ఎమ్మెల్యేలు,మంత్రులు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ये दोस्ती हम नहीं तोड़ेंगे...@SrBachchan @aapkadharam pic.twitter.com/coBPaN1hP1
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) August 11, 2021