టైమ్స్ నౌ సర్వే: కాంగ్రెస్కు షాక్, మధ్యప్రదేశ్ బీజేపీదే, వరుసగా శివరాజ్ రికార్డ్
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాంలలో ఎన్నికలు జరగనున్నాయి. లోకసభ ఎన్నికలకు ఐదారు నెలల ముందు జరిగే ఈ ఎన్నికలు అందరిలో మరెంతో ఆసక్తిని రేపుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలో బీజేపీ అధికారంలో ఉండగా, మిజోరాంలో కాంగ్రెస్, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన తెరాస అధికారంలో ఉంది.
మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లలో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మళ్లీ బీజేపీయే గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణ తిరిగి తెరాస దక్కించుకుంటుందని చెబుతున్నాయి. రాజస్థాన్ మాత్రం బీజేపీ నుంచి చేజారుతుందని, కాంగ్రెస్ వశమవుతుందని ప్రీ పోల్ సర్వేలు చెబుతున్నాయి. తాజాగా, టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వేలో మధ్యప్రదేశ్లో బీజేపీ గెలుస్తుందని తేలింది.
నాలుగోసారి గెలిచి శివరాజ్ సింగ్ రికార్డ్ సృష్టించడం ఖాయం
ఈ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచి, శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ముఖ్యమంత్రి అయి రికార్డ్ సృష్టిస్తారని ఈ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం 230 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 122 సీట్లలో గెలుస్తుందని తేలింది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సీట్లు 116. మరో ఆరు సీట్లు ఎక్కువగా రానున్నాయి.
కాంగ్రెస్ పుంజుకున్నప్పటికీ
కాంగ్రెస్ పార్టీకి 95 సీట్లు వస్తాయని ఈ సర్వేలో వెల్లడైంది. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బహుజన సమాజ్ పార్టీకి 3 సీట్లు వస్తాయని వెల్లడైంది. మరో పది స్థానాల్లో ఇతరులు గెలుస్తారని తెలింది.
ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లంటే?
ఓటు షేర్ విషయానికి వస్తే బీజేపీకి 41.75 శాతం, కాంగ్రెస్ పార్టీకి 38.52 శాతం, బీఎస్పీకి 5.41 శాతం ఓట్లు రానున్నాయని సర్వేలో వెల్లడైంది. 2013లో బీజేపీ 165 సీట్లు గెలిచి 44.88 శాతం, కాంగ్రెస్ 65 సీట్లు గెలిచి 36.38 శాతం ఓట్లు సాధించింది. బీఎస్పీ మూడు సీట్లు సాధించింది. వరుసగా నాలుగోసారి గెలవడం అంటే ఆషామాషీ కాదు. అయితే బీజేపీకి సీట్లు, ఓట్లు తగ్గి గెలుపు మాత్రం ఖాయమని చెబుతున్నారు.
ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహానే
అంతకుముందు, అక్టోబర్ మొదటి వారంలో చేసిన సర్వేలో బీజేపీకి 128 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 85 సీట్లు, బీఎస్పీకి 8 సీట్లు వస్తాయని వెల్లడైంది. ఇప్పుడు కాంగ్రెస్ మరింత పుంజుకుంది. ముఖ్యమంత్రి విషయానికి వస్తే.. శివరాజ్ సింగ్ను ఎక్కువ మంది కోరుకుంటున్నారు. శివరాజ్ను 40.11 శాతం మంది, కమల్నాథ్ను 20.32 శాతం మంది, జ్యోతిరాదిత్య సింధియాను 19.65 శాతం మంది కోరుకుంటున్నారు.
ఏ ప్రాంతంలో ఎవరు అంటే?
మధ్యప్రదేశ్లో ప్రాంతాల వారీగా చూస్తే మాల్వా నిమార్, బాఘెల్ఖండ్, భోపాల్, మహాకౌషల్ ప్రాంతాల్లో బీజేపీ ముందుంది. మాల్వా నిమార్లో బీజేపీ 72 స్థానాలకు గాను 61 చోట్ల గెలిచింది. గతంలో కంటే కాంగ్రెస్ నాలుగు ప్రాంతాల్లో పుంజుకుంది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్లు దక్కించుకునేంత మాత్రం పుంజుకోలేదనిసర్వేలో వెల్లడైంది. కాగా, మధ్యప్రదేశ్లో నవంబర్ 28న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న ఫలితాలు రానున్నాయి.