హృదయ విదారకం: కళ్ల ముందే మొసళ్లకు ఆహారమైన తల్లీకూతుళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నదిలో పడిన 12ఏళ్ల కూతురుతోపాటు ఆమె తల్లిని.. మొసళ్లు లోపలికి లాక్కెళ్లి చంపి తినేశాయి. తన మనవరాలు, కూతురు తన కళ్ల ముందే మొసళ్లకు బలి అయిపోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయానని అక్కడేవున్న ఓంకార్ సింగ్ అనే వ్యక్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు.
వివరాల్లోకి వెళితే.. కోట జిల్లాకు చెందిన ఓంకార్ సింగ్ గిల్(65) తన కూతురు మందీప్ కౌర్(36), మనవరాలు హర్పాల్ (12)లతో కలిసి అనారోగ్యానికి గురైన తల్లిని చూసేందుకు కారులో బయలుదేరారు.
లలితాపుర వద్ద షోపూర్-కుహాన్జాపూర్ జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించబోయి ప్రమాదవశాత్తు అహేలి నదిలో పడిపోయారు. ఇంతలో ఓంకార్ గిల్ బలవంతంగా కారు డోరు తెరచి బయటకు వచ్చి ఈదుకుంటూ నది ఒడ్డుకు చేరుకున్నాడు.
ఒడ్డుకు చేరిన గిల్కు తన కూతురు, మనవరాలి అరుపులు వినిపించడంతో నది వైపు చూశాడు. నదిలో పడిన తల్లీకూతుళ్లను మొసళ్లు తినడం చూసిన గిల్కు గుండె ఆగినంత పనైంది.
తన కళ్ల ముందే మనవరాలు, కూతురు మొసళ్లకు ఆహారంగా మారుతున్నా.. చేష్టలుడిగి చూస్తుండి పోయాడు గిల్. కాగా, కొంత సమయం తర్వాత తల్లీ కూతుళ్లు అదృశ్యమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు వచ్చి తల్లీ కూతుళ్ల మృతదేహాలను వెలికితీశారు.