మద్రాస్ ఐ కలకలం: వేలల్లో కేసులు- చిన్నా, పెద్దా తేడా లేదు: నివారణ ఇలా..!!
చెన్నై: తమిళనాడును మద్రాస్ ఐ (కండ్ల కలక) ఇన్ఫెక్షన్ పట్టి పీడిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చిన్నా, పెద్ద అనే తేడా ఉండట్లేదు. ప్రతి ఒక్కరూ దీని బారిన పడుతున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కంటి చూపును పోగొట్టుకునే ప్రమాదాన్ని ఎదుర్కొంటోన్నారు. అటు ఏపీ, కర్ణాటకల్లో కూడా మద్రాస్ ఐ కేసులు వెలుగులోకి వస్తోండటం కలకలం రేపుతోంది. ఈ ఇన్ఫెక్షన్తో పలువురు ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు.
రోజూ 4,000 మందికి పైగా
కొద్దిరోజులుగా తమిళనాడులో ఈ మద్రాస్ ఐ ఇన్ఫెక్షన్ శరవేగంగా విస్తరిస్తోంది. రోజూ 4,000 నుంచి 4,500 కేసులు నమోదవుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు. ఇప్పటివరకు లక్షన్నర మంది చికిత్స పొందినట్లు వివరించారు. ఈ ఇన్ఫెక్షన్కు గురైన వారు తక్షణమే డాక్టర్ను సంప్రదించాలని, సరైన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఇది అంటువ్యాధి కావడం వల్ల అప్రమత్తంగా ఉండాలని, డాక్టర్లను సంప్రదించకుండా సొంతంగా వైద్యం చేయించుకోకూడదని హెచ్చరించారు.
కట్టడికి..
మద్రాసు ఐ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అన్ని చర్యలను తీసుకుంటోన్నామని మంత్రి సుబ్రమణియన్ చెప్పారు. ఇప్పటి వరకు ఎవరూ గానీ దీని వల్ల చూపు కోల్పోయినట్లు సమాచారం లేదని అన్నారు. నిర్లక్ష్యం చేయొద్దని, స్వీయ వైద్యం కూడా పనికి రాదని తేల్చి చెప్పారాయన. తమిళనాడులో రోజూ 4,500 మంది మద్రాస్ ఐ బారిన పడుతున్నారని, దీని బారిన పడిన వారు కుటుంబ సభ్యులకు దూరంగా, ఒంటరిగా ఉండటమే మంచిదని పేర్కొన్నారు.
ఆసుపత్రి సందర్శన..
మద్రాస్ ఐ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతోన్న నేపథ్యంలో మంత్రి చెన్నైలోని కంటి ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఇన్ఫెక్షన్ సొకకుండా ఉండటానికి తేలికపాటి చర్యలు తీసుకుంటే సరిపోతుందని, నిర్లక్ష్యం చేస్తే మాత్రం అనర్థానికి దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. ఆసుపత్రుల్లో చేరిన వారికి తక్షణ చికిత్సను అందించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు.
కళ్లు ఎర్రగా..
మద్రాసు ఐని గుర్తించడం సులభమే. దీని బారిన పడిన వారి కళ్లు ఎర్రగా తయారవుతాయి. కళ్ల నుంచి నీళ్లు కారుతుంటాయి. దురద పెడుతుంటాయి. మద్రాస్ ఐకి గురైన వ్యక్తులు ఉపయోగించిన వస్తువులను ఇతరులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. కళ్లు దురదగా అనిపించినా, ఎర్రగా మారినా వెంటనే సమస్య ఉంటే డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది. సొంతంగా ఎలాంటి ఐ డ్రాప్స్ వేసుకోకూడదు. దీనివల్ల చూపు పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు.
డార్క్ గ్లాసెస్..
తరచూ చేతులను చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి. సబ్బుతో కడుక్కోవాలి. తమ ఎదురుగా ఉన్న వారిని నేరుగా కళ్లల్లో చూడకూడదు. దీన్ని నివారించడానికి బాధితులు డార్క్ గ్లాసెస్ను కంటికి ధరించాలని డాక్టర్లు చెబుతున్నారు. నేరుగా వెలుతురును కూడా చూడకూడదని దీని వల్ల కంటి నరాలపై ఒత్తిడి పడుతుందని, అది మద్రాస్ ఐ తీవ్రత పెంచేలా చేస్తుందని పేర్కొంటోన్నారు. చెన్నై ఎగ్మోర్ కంటి ఆసుపత్రిలో ప్రతిరోజూ 100 మందికి పైగా బాధితులు మద్రాస్ ఐ లక్షణాలతో చికిత్స కోసం వస్తోన్నారు.