కిడ్ని విక్రయాల దందా కింగ్ పిన్ అరెస్టు
బెంగళూరు: పేదల ఆర్థిక సమస్యలను గుర్తించి కిడ్నిలు విక్రయించి క్యాష్ చేసుకుంటున్న ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే కేసులో కిడ్ని విక్రయాలకు సహకరిస్తున్న మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
బెంగళూరు నగరంలోని కామాక్షిపాళ్యలో నివాసం ఉంటున్న సురేష్ అనే నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు అన్నారు. ఇతను తెలిపిన వివరాల ఆధారంగా ఈ కిడ్ని దందా కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
ఇతనికి సహకరించిన శ్రీనివాస్, హేమంత్, గోపాల్, కిడ్ని మంజు, బాబు అనే ఐదుగురిని అరెస్టు చేశారు. బెంగళూరు నగర శివార్లలోని మాగడి సమీపంలో ఉన్న నాగశెట్టి హళ్ళి నివాసి శశికళ అనే మహిళ గత స్థానిక సంస్థల ఎన్నికలలో పోటి చేసిన సమయంలో అప్పులు చేసింది.
చేసిన అప్పులు తీర్చడానికి తన కిడ్నిని విక్రయించింది. ఈ విషయం వెలుగు చూడటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇలాంటి ఆర్థిక సమస్యలు ఉన్న వారిని గుర్తించిన సురేష్ డయాలసిస్ చేయించుకోవడానికి ఆసుపత్రులకు వెళుతున్న శ్రీమంతులను గుర్తించి వారితో బేరం కుదుర్చుకుని పేదల కిడ్నిలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.