ఆసుపత్రిలో చెలరేగిన మంటలు: నలుగురి మృతి: వరుస ప్రమాదాల వెనుక..?
థానె: మహారాష్ట్రలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సృష్టించిన కల్లోల పరిస్థితులకు బ్రేక్ పడట్లేదు. మరో ఆసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు పేషెంట్లు మరణించారు. మరి కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను నియంత్రించారు. పేషెంట్లను మరో ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో కోవిడ్ పేషెంట్లు ఎవరూ లేరని డాక్టర్లు తెలిపారు.
థానె సమీపంలోని ముంబ్రా ప్రాంతంలో గల ప్రైమ్ క్రిటికేర్ ఆసుపత్రిలో ఈ తెల్లవారు జామున 3:40 నిమిషాలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతం మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవ్హద్ సొంత నియోజకవర్గం ముంబ్రా-కల్వా పరిధిలోకి వస్తుంది. మంటలు చెలరేగిన సమయంలో ఆసుపత్రిలో 20 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుమంది ఐసీయూలో ఉన్నారు. తొలుత ఆసుపత్రి మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అనంతరం ఆ ఫ్లోర్ మొత్తాన్నీ వ్యాపించాయి.


సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. ఆసుపత్రి మొదటి అంతస్తు మొత్తం కాలిపోయింది. మంటలు చెలరేగడానికి గల కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మృతుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామని జితేంద్ర అవ్హద్ తెలిపారు.












Click it and Unblock the Notifications