లాక్డౌన్: కాస్సేపట్లో సీఎం అత్యున్నత స్థాయి భేటీ: షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్, ఆలయాలు క్లోజ్
ముంబై: సెకెంండ్ వేవ్లో కరోనా వైరస్ మహారాష్ట్రలో అడ్డు, అదుపు లేకుండా విజృంభిస్తోంది. వేల సంఖ్యలో కరోనా కేసులు పుట్టుకొస్తోన్నాయి. దేశం మొత్తం మీద నమోదవుతోన్న రోజువారీ పాజిటివ్ కేసుల్లో 60 నుంచి 70 శాతం మేర మహారాష్ట్రలోనివే. గురువారం రాత్రి విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..మహారాష్ట్రలో కొత్తగా 43,183 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవరోచు. ఒక్క ముంబైలోనే రికార్డు స్థాయిలో 8,646 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. సెకెండ్ వేవ్ ఆరంభమైన తరువాత ముంబైలో 24 గంటల వ్యవధిలో ఈ రేంజ్లో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
షాకింగ్: అప్పుడే పుట్టిన కవలలకు సోకిన కరోనా: పసికందుల్లో ఒకేరకమైన లక్షణాలు..తల్లిలో!
ఈ పరిణామాల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ భేటీకి హాజరు కానున్నారు. రాష్ట్రంలో రోజురోజుకూ దిమ్మతిరిగి పోయే రేంజ్లో రికార్డవుతోన్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులను నియంత్రించడానికి తీసుకోవాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై చర్చించనున్నారు. ఆ ముందు జాగ్రత్త చర్యలు ఏ రూపంలో ఉంటాయనేది ప్రస్తుతం ఉత్కంఠతను రేకెత్తిస్తోంది.
కాగా- ముంబైలో కరోనా కేసుల ఉధృతి అధికంగా ఉన్నందు వల్ల పాక్షికంగా లాక్డౌన్ విధించే అవకాశాలు లేకపోలేదు. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడే ప్రదేశాలను మూసి వేస్తారనే ప్రచారం సాగుతోంది. షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్, ఫంక్షన్ హాల్స్, క్లబ్స్ వంటి చోట్ల కఠిన ఆంక్షలు విధించడమో లేక మూసివేయడమో చేస్తారని చెబుతున్నారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని దేవాలయాలను కూడా మూసి వేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించం ప్రాధాన్యతను సంతరించుకుంది.