మహారాష్ట్రలో మరణ మృదంగం : ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత, ఒకే ఆస్పత్రిలో ఒకే రోజు ఏడుగురు మృతితో ఉద్రిక్తత
మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే . దేశవ్యాప్తంగా నమోదైన కేసులో సగానికి ఒక మహారాష్ట్ర నుండే నమోదవుతున్నాయి. ఇక ముంబై నగరంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది . తాజాగా ముంబై సమీపంలోని ఒక ఆస్పత్రిలో కరోనా కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం ఉద్రిక్తతకు కారణమైంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్లే వారు మరణించారని బంధువులు ఆరోపించారు. ఆగ్రహంతో ఊగిపోయిన మృతుల బంధువులు ఆస్పత్రి మీద దాడికి దిగారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
పాల్ఘర్ జిల్లాలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఏడుగురు ఒకేరోజు మృతి
మహారాష్ట్రలో విపరీతమైన కోవిడ్ -19 సంక్షోభం మధ్య ఆసుపత్రుల సౌకర్యాల లేమి ఇబ్బందికర పరిణామాలకు కారణం అవుతుంది. పాల్ఘర్ జిల్లాలోని ఒక ఆసుపత్రిలో ఒకే రోజు ఏడుగురు మరణించడంతో మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్లే వారు ప్రాణాలు కోల్పోయారని మృతుల బంధువులు ఆరోపించారు .పాల్ఘర్ జిల్లాలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఏడుగురు ఒకేరోజు మృతిచెందడంతో ప్రభుత్వం పట్టింపు లేనట్టు వ్యవహరిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
నాలా సోపారాలోని వినాయక ఆసుపత్రిలో కరోనా మృతుల బంధువుల ఆందోళన
వసాయి-విరార్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నాలా సోపారాలో అధిక సంక్షోభం నెలకొంది. అయితే ఈ కోవిడ్ ఆస్పత్రిలోని వైద్యులు మాత్రం బాధితులు ఆసుపత్రికి వచ్చే వరకే సీరియస్ కండిషన్లో ఉన్నారని, ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేదని, రోగులను బతికించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెబుతున్నారు. ముంబైకి ఉత్తరాన 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాలా సోపారాలోని వినాయక ఆసుపత్రిలో సోమవారం మరణించిన ఏడుగురు బంధువులు ఆక్సిజన్ కొరతతో మరణించారని , ప్రాణనష్టానికి వైద్యుల బాధ్యతారాహిత్యం కారణమని ఆరోపించారు.
బాధిత కుటుంబాల ఆందోళనతో ఉద్రిక్తత .. పరిస్థితి అదుపు చేసిన పోలీసులు
ఆస్పత్రిలో ఏడుగురు మృతితో యుద్ధవాతావరణం నెలకొంది. ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఉందని చెప్తే ఇతర ఆసుపత్రులకు తమ వారిని తరలించేవారిమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బాధిత కుటుంబాలు ఆందోళన నేపథ్యంలో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో, పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆసుపత్రి అధికారులు మాత్రం రోగులు తక్కువ రోగనిరోధక శక్తిని కలిగివున్నారని , వయసు పైబడిన వారని, వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని వెల్లడించారు.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత .. మేయర్ వాయిస్ క్లిప్ వైరల్ .. బాధితుల ఆందోళన
వాసై-విరార్ మునిసిపాలిటీ గత మే రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటోంది. మేయర్ రాజీవ్ పాటిల్ నుండి వచ్చిన ఆడియో సందేశం సోషల్ మీడియా మెసేజింగ్ యాప్లలో వైరల్ గా మారింది. ఆసుపత్రులకు కావలసిన మౌలిక సదుపాయాలు అందించాలని ఆయన అందులో విజ్ఞప్తి చేశారు . ఈ ప్రాంతంలో 7,000 కన్నా ఎక్కువ క్రియాశీల కేసులు ఉన్నాయి మరియు రోజుకు 3,000 మందికి పైగా ఆక్సిజన్ సరఫరా అవసరం అవుతుంది. కానీ అందుకు తగినట్లుగా ఆక్సిజన్ వనరులు లేకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ క్రమంలోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని, రోగుల ఆందోళన తీవ్రతరం అవుతోంది.