మహారాష్ట్రలో కీలక పరిణామాలు: రాష్ట్రపతి పాలన?: గవర్నర్ జోక్యం: డీజీపీ, పోలీస్ కమిషనర్కు లేఖ
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న రాజకీయ సంక్షోభానికి రాష్ట్రపతి పాలనతో తెర పడుతుందా?.. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోందా?.. పోలీస్ డైరెక్టర్ జనరల్, ముంబై పోలీస్ కమిషనర్కు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి లేఖ రాయడానికి కారణం అదేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర రాజకీయాలు సాగుతున్నాయనే ప్రచారం ఊపందుకుంటోంది.
కోవిడ్ నుంచి కోలుకున్న వెంటనే..
కరోనా వైరస్ బారిన పడ్డ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ఇవ్వాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాజ్భవన్కు చేరుకున్నారు. ఆ వెంటనే రాజకీయ సంక్షోభంపై దృష్టి సారించారు. రెండు-మూడు రోజులుగా శివసేనకు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న దాడుల గురించి ఆరా తీశారు. దీనిపై ఆయన రాజ్భవన్లో సమీక్ష నిర్వహించారు. ముంబై సహా పుణే, రత్నగిరి, ఉస్మానాబాద్ వంటి పలు జిల్లాలు, తిరుగుబాటు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ దాడులు కొనసాగిన విషయం తెలిసిందే.
దాడులపై గవర్నర్ సీరియస్..
ఈ పరిణామాలను గవర్నర్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు. సమీక్ష ముగిసిన వెంటనే డీజీపీ రజనీష్ సేథ్, ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ పాండేలకు వేర్వేరుగా లేఖలు రాశారు. 38 మంది శివసేన, ఇద్దరు ప్రహార్ జన్శక్తి పార్టీ, ఏడుమంది స్వతంత్ర ఎమ్మెల్యేలకు తక్షణమే భద్రత కల్పించాలని ఆదేశించారు. వారి నివాసాలు, కార్యాలయాలు, క్యాంప్ ఆఫీసుల వద్ద పోలీసు బలగాలను మోహరింపజేయాలని సూచించారు. వారి కుటుంబ సభ్యులకూ భద్రత ఇవ్వాలని ఈ లేఖలో పేర్కొన్నారు.
భద్రత ఉపసంహరణ చట్టవిరుద్ధం..
వారికి కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవడం అక్రమమని గవర్నర్ కోష్యారి ఘాటుగా వ్యాఖ్యానించారు. అది చట్ట విరుద్ధమనీ అన్నారు. కొందరు రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు, హెచ్చరికలు అందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని అన్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాలు, ధ్వంసం అయ్యాయని గుర్తు చేశారు.
రెబెల్స్కు భద్రత..
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, నివాసాలకు తక్షణమే భద్రత కల్పించాలని ఆదేశించారు. కాగా- 16 మంది రెబెల్స్కు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీని కల్పించిన విషయం తెలిసిందే. ఈ ఉదయమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. ఆర్మ్డ్ సీఆర్పీఎఫ్ జవాన్లతో వారికి రక్షణ కల్పించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర పోలీసు యంత్రాంగాన్నీ ఆదేశించింది.
వై ప్లస్ సెక్యూరిటీ వీరికే..
వై ప్లస్ సెక్యూరిటీని కల్పించిన వారిలో రమేష్ బోర్నరె, మంగేష్ కుడల్కర్, సంజయ్ షిర్సత్, లతాబాయి సొనావనె, ప్రకాష్ సుర్వె, సదానంద్ సరనవ్కర్, యోగేష్ దాదా కదమ్, ప్రతాప్ సర్నాయిక్, యామిని జాదవ్, ప్రదీప్ జైస్వాల్, సంజయ్ రాథోడ్, దాదాజి భుసె, దిలీప్ లండే, బాలాజీ కల్యానర్, సాందీపన్ భుమారె ఉన్నారు. వారికి తక్షణమే ఆర్మ్డ్ సీఆర్పీఎఫ్ జవాన్లతో కూడిన వై ప్లస్ సెక్యూరిటీ అందుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది.