వైద్యుల సమ్మె బాట: 'మహా' ఆరోగ్య సంక్షోభం
భద్రత కల్పించాలని కోరుతూ సమ్మె చేస్తున్న 40 వేల మంది భారతీయ వైద్య సంఘం సభ్యులైన డాక్టర్లు తక్షణం విధులకు హాజరు కావాలని మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల సంఘం (ఎంఎఆర్డి) పిలుపునిచ్చింది.
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోనూ వైద్యసేవలు వరుసగా ఐదో రోజూ స్తంభించిపోయాయి. తమకు సరైన భద్రత కల్పించాలని జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ముంబైలోని కొన్నిఆసుపత్రులలో మినహా వైద్యులు విధులకు గైర్హాజరయ్యారు. భద్రత కల్పించాలని కోరుతూ సమ్మె చేస్తున్న 40 వేల మంది భారతీయ వైద్య సంఘం సభ్యులైన డాక్టర్లు తక్షణం విధులకు హాజరు కావాలని మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల సంఘం (ఎంఎఆర్డి) పిలుపునిచ్చింది.
కానీ ఇది వ్యక్తిగత స్థాయిలో జరుగుతున్న ఆందోళన మాత్రమేనని, ఎంఎఆర్డి ఆధ్వర్యంలో సాగుతున్న సమ్మె కాదని స్పష్టం చేసింది.హైకోర్టు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆరోగ్యశాఖ మంత్రి విజ్నప్తులపై స్పందించి తక్షణం ప్రతి రెసిడెంట్ డాక్టర్ విధులకు హాజరు కావాలని కోరింది. విధులకు హాజరు కావాలా? వద్దా? వైద్యులు వ్యక్తిగతంగా నిర్ణయించుకోవాలని తెలిపింది.
ఎంఎఆర్డి ఆధ్వర్యంలో సోమవారం నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సామూహిక సెలవుపై వెళ్లారు. తమకు ప్రభుత్వం, ఆసుపత్రుల యాజమాన్యాలు భద్రత, రక్షణ కల్పించగలిగితే తాము వెంటనే విధులకు హాజరయ్యేందుకు సిద్ధమని వైద్యులు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు.
సీఎంతో భేటీ తర్వాత నిర్ణయం
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో చర్చలు జరిపిన తర్వాత సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) తెలిపింది. ముంబై పూర్తిస్థాయి వైద్య ఉపాధ్యాయుల సంఘం (ఎఫ్టిఎంటిఎ) కూడా సీఎంతో భేటీ తర్వాత తమ వైఖరి తెలియజేస్తామని పేర్కొంది. తమ డిమాండ్లను 48 గంటల్లోగా ప్రభుత్వం ఆమోదించకపోతే సామూహిక రాజీనామాలు చేస్తామని హెచ్చరించింది. ముంబై నగర వ్యాప్తంగా ఎఫ్టిఎంటిఎలో 1200 మందికి పైగా సభ్యులు ఉన్నారు.
రెసిడెంట్ డాక్టర్లకు ఎఫ్టిఎంటిఎ మద్దతు
వైద్యులపై దాడుల నివారణకు భద్రత కల్పించాలని కోరుతూ సమ్మెచేస్తున్న రెసిడెంట్ డాక్టర్లకు ఎఫ్టిఎంటిఎ పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే వైద్యులు సమ్మె విరమించి విధులకు హాజరైతే ప్రభుత్వం తగు భద్రతా చర్యలు చేపడతారని బాంబే హైకోర్టు ఆదేశించింది. కాగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రెసిడెంట్ డాక్టర్లతోపాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న 40 వేల మంది వైద్యులు మద్దతు పలికారు. ముంబై నగరంలో 40 ఆసుపత్రులు ముంబైకర్లకు వైద్య సేవలందించాయి.
మళ్లీ మహిళా డాక్టర్పై దాడి
ఒకవైపు వైద్యుల సమ్మె జరుగుతుండగానే గురువారం ధూలె ప్రభుత్వాసుపత్రిలో మహిళా డాక్టర్పై రోగి బంధువులు దాడి చేశారు. తరుచుగా దాడులతో గాయాల పాలవుతున్న రెసిడెంట్ డాక్టర్ల ఆందోళనకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మద్దతు పలికింది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు వైద్యులపై దాడులు జరిగిన కేసులు 50కి పైగా నమోదయ్యాయి. కానీ వైద్యులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని పలువురు చెప్తున్నారు.దీనికి తోడు ఈ నెల 22వ తేదీన ఈ వివాదంలో పాలుపంచుకున్న మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి గిరిష్ మహాజన్ అదే రోజు రాత్రి ఎనిమిది గంటల్లోపు విధులు హాజరు కాకపోతే వారి ఆరు నెలల వేతనంలో కోత విధిస్తామని బెదిరింపులకు దిగారు. నెల రోజుల్లో ఆసుపత్రుల పరిధిలో 1100 మంది భద్రతాగార్డులను నియమిస్తామన్నారు.
వైద్యులకు బీఎంసీ షోకాజ్
మరోవైపు బ్రుహన్ ముంబై నగర పాలక సంస్థ (బీఎంసీ) 1200 మంది వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. తక్షణం విధులకు హాజరు కాకపోతే సర్వీసుల నుంచి డిబార్ చేస్తానని బెదిరింపులకు దిగింది. ఇక నాగ్ పూర్లో మెడికల్ కళాశాల డీన్ మరో అడుగు ముందుకేసి 300 మంది రెసిడెంట్ డాక్టర్లను సస్పెండ్ చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ లోగా ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద 700 మంది భద్రతా గార్డులను నియమిస్తామని బీఎంసీ మేయర్ విశ్వనాథ్ మహదేశ్వర్ తెలిపారు. ఆసుపత్రిలో పేషంట్తోపాటు ఇద్దరు సహాయకులను అనుమతించాలని, వ్యక్తిగత భద్రతాగార్డులను అప్రమత్తం చేసేందుకు మోగించేందుకు అలారం వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న వైద్యుల డిమాండ్లకు ఆమోదం తెలిపింది.
బహిరంగ అరాచకమని బాంబే హైకోర్టు
మహారాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సమ్మెను బహిరంగ అరాచకమని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. వైద్యుల సమ్మెను పరిష్కరించాలని సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ మంజులా చెల్లూర్, జస్టిస్ జీఎస్ కులకర్ణి సారథ్యంలోని ద్విసభ్య బెంచ్ విచారణ స్వీకరించడంతోపాటు వైద్యుల ప్రవర్తన సిగ్గుచేటని వ్యాఖ్యానించింది. సీనియర్ వైద్యులకు లేని ముప్పు జూనియర్లకు ఎక్కడ నుంచి ఉంటుందని ప్రశ్నించింది. ఒకవేళ ప్రభుత్వ ఆదేశాలను తోసిరాజని సమ్మెలో పాల్గొనే వైద్యుల 12 నెలల వేతనంలో కోత విధించాలని ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు.. ఆసుపత్రుల్లో మాత్రం భద్రత కల్పించాలని స్పష్టం చేసింది.
సమ్మెలో 60 శాతం వైద్యులు..
నాలుగు రోజులుగా మహారాష్ట్రలోని 60 శాతం మంది ప్రభుత్వ వైద్యులు సమ్మెలో పాల్గొంటుండటంతో రాష్ట్రంలో ఆరోగ్య సంక్షోభం నెలకొంది. ఈ పరిస్థితుల్లో పలువురు రోగులు తమ చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించక తప్పని దుస్థితి నెలకొంది. పలువురు రోగులు ప్రాణాంతక వ్యాధులతో బాధ పడుతున్నారు. కేవలం సీనియర్ వైద్యులు మాత్రమే విధులు నిర్వర్తిస్తుండటంతో సకాలంలో రోగులకు వైద్య సేవలు అందుబాటులో లేరు.
హెల్మెట్లతో ఎయిమ్స్లో వైద్యుల విధులు
మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్ల ఆందోళనకు మద్దతుగా ఢిల్లీలో రాం మనోహర్ లోహియా, లేడీ హర్డింగే మెడికల్ కాలేజీ, సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వైద్యులు కూడా విధులకు గైర్హాజరవుతున్నారు. ఎయిమ్స్ వైద్యులు హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. గువాహటి మెడికల్ కళాశాల వైద్యులు సమ్మెలో పాల్గొంటున్నారు.