సర్కారు బంపర్ ఆఫర్.. ఎలక్ట్రిక్ వాహనాలకు టోల్ ప్లాజాలలో ఫ్రీ !
మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు (కార్లు, బైకులు, బస్సులు) టోల్ప్లాజాలలో టోల్ ఫ్రీ గా ప్రయాణించవచ్చని అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించడమే కాక.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి తీసుకున్నట్టు చెబుతున్నారు.
2025 ఎలక్ట్రిక్ వాహన విధానం ప్రకారం, ఆగస్టు 22వ తేదీ నుంచి ముంబైలోని అటల్ సేతుపై అన్ని ఫోర్ వీల్ ఎలక్ట్రిక్ వాహనాలు (కేటగిరీ M1), ఎలక్ట్రిక్ బస్సులు (కేటగిరీ M3, M4) టోల్ ఫీజు చెల్లించకుండా ప్రయాణించగలవు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు కూడా మినహాయింపులో భాగమని స్పష్టం చేశారు. గూడ్స్ వాహనాలకు ఈ మినహాయింపు వర్తించదని అంటున్నారు. ఈ మినహాయింపు శివాజీ నగర్, గవాన్ టోల్ గేట్ల వద్ద అమల్లోకి వచ్చింది.

ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కేవలం అటల్ సేతుపై మాత్రమే కాకుండా, ముంబై-పూణే ఎక్స్ప్రెస్వే, సమృద్ధి ఎక్స్ప్రెస్వే వంటి ఇతర కీలక రహదారులపై కూడా అమలు చేయనుంది. రాష్ట్ర, జాతీయ రహదారులపై ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు టోల్ ఛార్జీలలో 50% డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టోల్ మినహాయింపు వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులకు మరింత ఆకర్షణీయమవుతాయని ఆశిస్తున్నారు.
అంతే కాకుండా దేశంలో పెరుగుతున్న కాలుష్య పరిస్థితులను పరిగణలోకి తీసుకొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ అనేక విధానాలు చేపడుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణ పరిరక్షణలో ముందంజలో ఉండాలని భావిస్తోంది.
ఈ నిర్ణయం వల్ల ప్రయోజనాలు..
- రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించడం
- పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించడం
- ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను వృద్ధి చేయడం
- ఎలక్ట్రిక్ వాహన కంపెనీలకు పెరుగుతున్న పెట్టుబడులు
- ప్రజలకు ఆర్థిక ఊరట కల్పించడం












Click it and Unblock the Notifications