'మహా' గొడవ: 'గాయపడిన' చెన్నమనేని, సస్పెన్షన్స్
మహారాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నీవస్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష తీరును కాంగ్రెసు, శివసేన సభ్యులు నిరసించారు. బిజెపి మెజారిటీని నిరూపించుకోవడంలో విఫలమైందని, ప్రజాస్వామ్యాన్ని ఉరేసిందని విమర్శిస్తూ కాంగ్రెసు, శివసేన సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే విద్యాసాగర రావును అసెంబ్లీకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కాంగ్రెసు శాసనసభ్యులు రాహుల్ బోంద్రే, అమర్ కాలే, రంజిత్ కాంబ్లే, విజయ్ వాడెట్టివార్, అబ్దుల్ సత్తార్ గవర్నర్ను గాయపరిచారని ఖాడ్సే శాసనసభలో చెప్పారు. ఆ ఐదుగురు శాసనసభ్యులను స్పీకర్ సభ నుంచి రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు. గవర్నర్ ఎడమ చేతికి గాయమైందని, క్షమాపణతో సమస్య సమసిపోదని, దాన్ని సహించకూడదని ఖాడ్సే అన్నారు.
ఎవరినీ కూడా గాయపరిచే ఉద్దేశం తమకు లేదని, అయితే తాము క్షమాపణ చెబుతున్నామని శాసనసభలో కాంగ్రెసు పక్ష నేత రాధాకృష్ణ విఖే పాటిల్ అన్నారు. జరిగిన సంఘటన నిజమైతే క్షమాపణలతో ఆ వివాదానికి స్వస్తి చెప్పాలని ఎన్సిపీ శాసనసభ్యులు అజిత్ పవార్, ఆర్ పాటిల్, ఛగన్ భుజబల్ కోరారు. మహారాష్ట్ర కొత్త సభ సమావేశం ఇలాంటి చేదు సంఘటనతో ప్రారంభం కాకుండా ఉండాల్సిందని వారన్నారు. సంఘటనకు తాను ప్రత్యక్ష సాక్షిని అని, అది ఆక్షేపణీయమని బిజెపి శాసనసభ్యుడు గిరీష్ మహాజన్ చెప్పారు. రాజకీయ పక్షాల నేతలతో చర్చించడానికి స్పీకర్ హరిబాబు బాగ్డే సభను అర గంటపాటు వాయిదా వేశారు.
శాసనసభ వెలుపల జరిగిన సంఘటనపై చర్యలు తీసుకునే హక్కు స్పీకర్కు లేదని రషీద్ అల్వీ అన్నారు. తమను లక్ష్యంగా చేసుకున్నారని, తమ గొంతులు నొక్కేస్తున్నారని సస్పెన్షన్కు గురైన కాంగ్రెసు శాసనసభ్యుడు అబ్దుల్ సత్తార్ అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం విశ్వాస పరీక్షలో మెజారిటీని నిరూపించుకోలేదని, దాని గురించి చెప్పడానికి తాము గవర్నర్ను నిలువరించామని ఆయన అన్నారు.కాంగ్రెసు నినాదాల మధ్య గవర్నర్ విద్యాసాగర రావు తన ప్రసంగాన్ని కొనసాగించారు.