ఆ రాష్ట్రంలో వారంలో మూడు రోజుల పాటు స్ట్రిక్ట్ లాక్డౌన్: ఆలయాలు సహా అన్నీ క్లోజ్
ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మహారాష్ట్రలో బీభత్సాన్ని సృష్టిస్తోంది. విలయతాండవం చేస్తోంది. ఏ మాత్రం అంచనాలకు అందని విధంగా చెలరేగిపోతోంది ఒక్కరోజులో దిమ్మ తిరిగే స్థాయిలో.. వేల సంఖ్యలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి. రోజురోజుకూ వాటి సంఖ్య రాకెట్లా దూసుకెళ్తోంది. ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఒక్కరోజు వ్యవధిలో మహారాష్ట్రలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 57,074. 222 మంది మృత్యువాత పడ్డారు. అరలక్షకు పైగా కొత్త కేసులు నమోదు కావడం ఇదివరకటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి.

వీకెండ్ లాక్డౌన్ అమలు..
ఎన్నికలను ఎదుర్కొంటోన్న నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా ఈ స్థాయిలో కేసులు నమోదు కాలేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట ప్రభుత్వం కరోనా నిబంధనలను సవరించింది. మరింత కఠినతరం చేసింది. ఇదివరకు విధించిన వారాంతపు లాక్డౌన్ను మరింత విస్తృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటిదాకా పుణె, నాగ్పూర్, నాసిక్ వంటి కొన్ని నగరాలకే పరిమితమైన లాక్డౌన్ రాష్ట్రం మొత్తం విస్తరింపజేయనున్నట్లు వెల్లడించింది.

శుక్ర, శని, ఆదివారాల్లో..
ఈ శుక్రవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి అదనంగా ప్రస్తుతం అమల్లో ఉన్న నైట్ కర్ఫ్యూ నిబంధనలు మరింత కఠినతరం చేసింది. అయిదుమందికి మించి ఎక్కువగా గుమికూడటాన్ని నిషేధించింది. షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్, బార్లు, రెస్టారెంట్లు, ఆలయాలను మూసివేస్తున్నట్లు తెలిపింది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు ఈ నిషేధాజ్ఙలు కొనసాగుతాయి.

కఠినంగా కరోనా ప్రొటోకాల్..
హోమ్ డెలివరీ, అత్యవసర సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయి. పరిశ్రమలు, నిర్మాణ రంగం కార్యకలాపాలు యధాతథంగా కొనసాగుతాయి. కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో కోవిడ్ ప్రొటోకాల్స్ను కఠినంగా అమలు చేసేలా అధికార, పోలీసు యంత్రాంగాన్ని మోహరింపజేస్తామని తెలిపింది. రద్దీ రహితంగా సినిమా షూటింగులను నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చింది. వీకెండ్ లాక్డౌన్ సమయంలో థియేటర్లు సైతం మూతపడతాయి.

వేల సంఖ్యలో కొత్త కేసులు..
మహారాష్ట్రలో సెకెండ్ వేవ్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒక్కరోజే 57,074 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంతగా అదుపు తప్పిందో అర్థం చేసుకోవచ్చు. 222 మంది కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటిదాకా అక్కడ నమోదైన మొత్తం కరోనా కేసులు 30,10,597 కాగా.. ఇందులో 25,22,823 మంది డిశ్చార్జ్ అయ్యారు. 55,878 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 4,30,503గా రికార్డయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఆదివారం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. వీకెండ్ లాక్డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నారు.












Click it and Unblock the Notifications