మహా సర్కార్ త్వరలోనే కూలిపోతుంది... బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు...
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును సుప్రీం కోర్టు సీబీఐకి అప్పగిస్తూ తీర్పునిచ్చిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మహారాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీం తీర్పును స్వాగతించిన ఆయన... మహా సర్కార్ త్వరలోనే కూలిపోతుందని వ్యాఖ్యానించారు.
'మహారాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. సంజయ్ రౌత్ లాంటి శివసేన నేతలు సుశాంత్ కుటుంబాన్నే విమర్శించారు. ఇప్పుడేమైంది... సుప్రీం తీర్పుతో మహారాష్ట్ర సర్కార్ ఏడుస్తోంది. మిత్రులారా,త్వరలోనే మహారాష్ట్ర సర్కార్ కూలిపోతుందనే వార్త మనం వినబోతున్నాం.' అని సంబిత్ పాత్రా ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో శివసేన సర్కార్పై మ్యాథమెటికల్గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'Shiv Sena = SONIA+RHEA=SORHEA SENA' అంటూ రియా చక్రవర్తిని కూడా చేర్చి సెటైర్స్ వేశారు.
అంతకుముందు,మరో ట్వీట్లో సుప్రీం తీర్పును స్వాగతించిన ఆయన... కేసును సీబీఐకి అప్పగించిన సందర్భంగా సుశాంత్ కుటుంబ సభ్యులకు కంగ్రాట్స్ చెప్పారు. అలాగే మీడియా,బిహార్ ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వం,న్యాయవాదులకు కూడా అభినందనలు తెలిపారు. సీబీఐ తీర్పుతో అసలు నిజమేంటో నిగ్గు తేలుతుందన్నారు.
కాగా,సుశాంత్ కేసు విషయంలో మహారాష్ట్ర,బిహార్ ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకుండా పోయింది. బిహార్ ఇదివరకే సీబీఐ దర్యాప్తుకు సిఫారసు చేయడాన్ని మహా సర్కార్ తీవ్రంగా వ్యతిరేకించింది. అటు కేంద్రం కూడా ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. వీటన్నింటి నేపథ్యంలో తాజాగా సుప్రీం నుంచే ఆదేశాలు రావడం గమనార్హం.
సుశాంత్ మరణంపై పాట్నాలో దాఖలైన ఎఫ్ఐఆర్ను సుప్రీం సీబీఐకి బదలాయించింది. సీబీఐ దర్యాప్తుకు ముంబై పోలీసులు సహకరించాలని సుప్రీం సూచించింది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ దీనిపై స్పందిస్తూ సీబీఐ విచారణకు సహకరిస్తామన్నారు. మరోవైపు సుప్రీం తాజా తీర్పును నితీశ్ కుమార్ ప్రశంసించారు.
సుశాంత్ కేసును విచారించనున్న సీబీఐ సిట్ బృందంలో ఇద్దరు ఎస్పీలు,ఒక విచారణ అధికారి ఉండనున్నారు. గురువారం(అగస్టు 20) వారు ముంబై చేరుకునే అవకాశం ఉంది.