టీవీ9 ఎగ్జిట్పోల్-మహారాష్ట్రలో బీజేపీ-సేనకే మళ్లీ పట్టం, హర్యానాలో కూడా, విపక్షానికే కాంగ్రెస్..
మరాఠా గడ్డపై బీజేపీ-శివసేన మరోసారి జెండా ఎగరేయబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మెజార్టీ సాధించబోతోంది. ఈ మేరకు టీవీ9 సిసిరో ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. కాంగ్రెస్-ఎన్సీపీ మళ్లీ విపక్షానికే పరిమితమయ్యాయి. ఇతరులు కూడా అంతగా ప్రభావితం చేయలేకపోయారు. ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్ల ప్రభావం ఎక్కువ ఉంటుందని భావించినా.. బీజేపీ-శివసేన కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చిందని టీవీ9 అంచనాలు వేసింది.
బీజేపీ-సేనదే అధికారం
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి. బీజేపీ-శివసేన 197 సీట్లు గెలుచుకుంటుందని టీవీ9 లెక్కగట్టింది. అధికారం చేపట్టాలంటే 145 సీట్లు గెలిస్తే చాలు. కానీ బీజేపీ-శివసేన కూటమి మరో 50 సీట్ల వరకు ఎక్కువ గెలుచుకొని మరింత బలంగా కనిపించాయి. దీనికి మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ రాజకీయం, టికెట్ల కేటాయింపు కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
కలిసొచ్చిన చేరికలు
ఎన్నికలకు ముందే కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలకు చెందిన ప్రధాన నేతలు కూడా బీజేపీలో చేరడం కూడా బీజేపీకి కలిసొచ్చింది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి 75 సీట్లు మాత్రమే గెలుచుకొంటుందని టీవీ9 లెక్కగట్టింది. ఈ కూటమి మరోసారి విపక్ష స్థానానికే పరిమితమైంది. ఎన్నికలకు ముందు తమ పార్టీ అధికారం చేపడుతుందని మేకపోతు గాంభీర్యం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. టీవీ9 ఎగ్జిట్ పోల్ ప్రకారం మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన, ఇతర ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు కేవలం 16 సీట్లతో సరిపెట్టుకుంటారని అంచనావేసింది.
హర్యానాలోనూ
ఇటు హర్యానాలో కూడా బీజేపీ హవా కనిపించింది. టీవీ9 భారత్వర్ష్ ప్రకారం బీజేపీ 47 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతుంది. హర్యానాలో 90 స్థానాలు ఉన్నాయి. అధికారం చేపట్టాలంటే 46 సీట్లు అవసరం.. అంటే ఒక్క సీటుతో అధికారం చేపట్టబోతుంది. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలు మాత్రం 23 సీట్లతో సరిపెట్టుకుంటాయని పేర్కొన్నాయి.
కీలకం కానున్న ఇతరులు..?
హర్యానాలో టీవీ9 భారత్వర్ష్ ప్రకారం 20 సీట్లు గెలుచుకుంటారని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ సీట్లలో అటు ఇటు తేడా జరిగితే ఇండిపెండెంట్లు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.