MH Elections: గెలవాలంటే కలవాల్సిందే..!!
మహారాష్ట్ర రాజకీయాల రూటే సపరేటు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో కొత్త పొత్తులు తెర మీదకు వస్తున్నాయి. రాష్ట్రంలో గత మూడు దశాబ్దాల కాలంగా జత కట్టిన పార్టీల కూటములే అధికారంలోకి వస్తున్నాయి. మిత్రులు శత్రువులుగా.. ప్రత్యర్థులుగా కూటమి మిత్రులు గా మారటం పరిపాటి అయింది. ఇక, గత అయిదేళ్ల కాలంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారాయి. ఇప్పుడు ఎన్నికల్లోనూ కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఇక్కడ గెలవాలంటే కలవాల్సిందే అనే పరిస్థితి ఏర్పడింది.
పొత్తులు - సీట్లు
మహారాష్ట్రలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. కూటముల మధ్య సీట్ల పంపకాల పైన చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. రెండు ప్రధాన కూటముల ముఖ్యమంత్రి అభ్యర్ధుల పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. తమ కూటమి నుంచి షిండేనే సీఎం అంటూ ఫడ్నవీస్ పరోక్షంగా ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు చర్చగా మారాయి. ఇక..మహారాష్ట్రలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఇప్పుడు కూటమితోనే సాధ్యంగా మారింది. 1995 నుంచి మహారాష్ట్రలో ఇప్పటి వరకు కూటములే అధికారంలోకి వస్తున్నాయి. రాజకీయ మైత్రి, వైరాలకు కూటములే వేదికగా మారుతున్నాయి. ఎన్సీపీ, శివసేన ప్రభావంతో జాతీయ పార్టీలకు కూటమి కట్టటం తప్పటం లేదు.

గెలవాలంటే జత కట్టాల్సిందే
మహారాష్ట్రలో 1995 లో తొలిసారి బీజేపీ - శివసేన జత కట్టి అధికారంలోకి వచ్చాయి. అదే విధంగా 1999 లో కాంగ్రెస్ - ఎన్సీపీ ఎన్నికల అనంతర పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటం చేయటం ద్వారా ఏకంగా 15 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించాయి. 2014లో కూటమిగా కాకుండా నాలుగు ప్రధాన పార్టీలు వేర్వేరుగా పోటీ చేసాయి. కానీ, ఏ పార్టీకి అధికారం దక్కించుకోవటానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. ఆ సమయంలో తిరిగి బీజేపీ - శివసేన అధికారం దక్కించుకున్నాయి. 2019లోనూ ఈ రెండు పార్టీలే కలిసి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించాయి. కానీ, ముఖ్యమంత్రి పదవి పైన ఏర్పడిన వివాదంతో పొత్తు విడిపోయింది.
కూటమిదే అధికారం
బీజేపీతో విడిపోయిన శివసేన అనూహ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, 2022లో శివసేనలో చీలిక వచ్చింది. బీజేపీ మద్దతుతో ఏక్ నాధ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ చీలిక అజిత్ పవార్ నాయకత్వంలోని పార్టీ కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) కలిసి మహా వికాస్ అఘాడీగా పోటీ చేస్తున్నాయి. దీంతో రానున్న ఐదేండ్లూ మహారాష్ట్రలో ఏదో ఓ కూటమి పాలనే ఉండనుంది. అయితే, ఏ కూటమికి ప్రజలు పట్టం కడతారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications