మహారాష్ట్రలో కరోనా కల్లోలం: కొత్తగా 30వేలకుపైగా కరోనా కేసులు, 2 లక్షలకుపైగా యాక్టివ్ కేసులు
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజు రోజుకు మరింతగా విజృంభిస్తోంది. వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రంలో 30వేలకుపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆదివారం మహారాష్ట్రలో కొత్తగా 30,535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం.
తాజాగా నమోదైన 30,535 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 24,79,682కు చేరింది. ఆదివారం 11,314 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 89.32కు తగ్గింది. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 22,14,867కు చేరింది.
గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 99 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల రేటు 2.15గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,10,120 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 9,69,867 మంది హోంక్వారంటైన్లో ఉండగా, 9,601 మంది ఇనిస్ట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నారు.
కాగా, శనివారం మహారాష్ట్రలో 27,126, శుక్రవారం 25,681, గురువారం 25,833 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 27,000 కేసులు నమోదవడంతో శనివారం తాజా రికార్డు మళ్లీ బద్దలైంది. ఆదివారం నమోదైన కొత్త కేసులు శనివారం నాటి రికార్డును బద్దలు కొట్టింది.
మహారాష్ట్రలో తాజా ఆంక్షలు
కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తోంది. పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల దృష్ట్యా, ఆడిటోరియంలు, థియేటర్లు, ప్రైవేట్ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆంక్షలు విధించింది.
తాజా కోవిడ్ -19 మార్గదర్శకాల ప్రకారం, మహారాష్ట్రలోని ఆడిటోరియంలు, థియేటర్లు 50 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేయడానికి అనుమతించబడతాయి. అదేవిధంగా ప్రైవేట్ కార్యాలయాలు కూడా 50 శాతం సిబ్బందితో పనిచేయడానికి అనుమతించబడతాయి. ఈ పరిమితులు మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రంలోని అనేక జిల్లాలు, నగరాలు కూడా పాక్షిక లేదా మొత్తం లాక్డౌన్ క్రిందకు వెళ్ళాయి. నాగ్పూర్లో వేగంగా పెరుగుతున్న కోయివిడ్ -19 కేసులను గమనించి, నగరంలో కొనసాగుతున్న లాక్డౌన్ను మార్చి 31 వరకు పొడిగించాలని జిల్లా అధికారులు శనివారం నిర్ణయించారు. నాగ్పూర్ నగరంలో మార్చి 15 నుంచి 21 వరకు పూర్తి లాక్డౌన్ విధించారు.