మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడాలంటూ ఫడ్నవీస్కు ఉద్ధవ్ థాక్రే కాల్ చేశారా?: శివసే ఇలా
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ తాక్రే.. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ను కలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని శివసేన నేతలు స్పష్టం చేస్తున్నారు.
రెబల్ నేత ఏక్నాథ్ షిండే శిబిరానికి మెజార్టీ ఎమ్మెల్యేలు చేరుకోవడంతో జూన్ 21న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడేందుకు సీఎం ఉద్ధవ్ థాక్రే మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్కు ఫోన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ అధిష్టానంతో ఉద్ధవ్ థాక్రే మాట్లాడాలని అనుకున్నారు కానీ, చివరకు ఆ ప్రయత్నం మానుకున్నారని విశ్వసనీయ సమాచారం.
ఉద్ధవ్, దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య ఎలాంటి సంభాషణలు జరగలేదని శివసేన వర్గాలు చెబుతున్నాయి. ఉద్ధవ్ థాక్రే ఏదీ చేయాలనుకుంటే అదే చేస్తారని పేర్కొన్నాయి. ఏక్నాథ్ షిండే క్యాంపులో ఇప్పటికే 50 మందికిపైగా రెబల్ ఎమ్మెల్యేలు ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే.
మరోవైవు, రానున్న రెండు రోజుల్లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ఉద్ధవ్ ప్రభుత్వాన్ని బలనిరూపణ కోరే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 16 ఎమ్మెల్యేలకు అనర్హత వేటు కోసం ఇచ్చిన నోటీసులను సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు మహా వికాస్ అఘాడీకి రాబోయే 48 గంటలు ఎంతో కీలకంగా మారనున్నాయి. ఇక, ఏక్ నాథ్ షిండే తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలతో గవర్నర్ ను కలిసి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపే అవకాశం కూడా లేకపోలేదు.