మహిళా పోలీసులకు పని గంటలు తగ్గింపు-12 గంటల నుంచి 8 గంటలకు కుదింపు
దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేరాల రేటుతో పోలీసులపై పని భారం కూడా అంతే పెరిగిపోతోంది. పేరుకి పని గంటలే అయినా అంతకంటే ఎక్కువే పని చేయాల్సిన పరిస్ధితులు నెలకొంటున్నాయి. మహిళా పోలీసుల సంగతి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. కుటుంబాల్ని వదులుకుని గంటల తరబడి పోలీసు స్టేషన్లలో, క్రైమ్ లొకేషన్లలో విధులు నిర్వర్తించాల్సిన పరిస్ధితి. దీంతో ఇప్పుడు వారి పని గంటలపై చర్చ మొదలైంది.
మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న పని గంటల సమస్యపై మహారాష్ట్రలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇక్కడ మహిళా పోలీసులు 12 గంటల పాటు పనిచేయాల్సి ఉండగా.. అది కాస్తా 16, 18 గంటలకు కూడా పెరిగిపోతున్న పరిస్దితి. దీంతో తాజాగా మహిళా పోలీసులు మహారాష్ట్ర డీజీపీకి ఈ విషయంపై మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఉద్ధవ్ ధాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దీనికి అంగీకరించడంతో మహిళా పోలీసుల పని గంటలకు తగ్గేందుకు వీలు కలగనుంది.
మహారాష్ట్రలో ఇకపై మహిళా పోలీసుల పని గంటల్ని 12 నుంచి 8 గంటలకు తగ్గిస్తున్నట్లు డీజీపీ సంజయ్ పాండే ఇవాళ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో దీన్ని అమలు చేస్తున్నామని, దశల వారీగా రాష్ట్రమంతా దీన్ని విస్తరించబోతున్నట్లు పాండే వెల్లడించారు. దీనికి అనుగుణంగా షిప్ట్ లు కూడా మారుస్తామని డీజీపీ పేర్కొన్నారు. ప్రస్తుతం నాగ్ పూర్, పూణే, అమరావతిలో మహిళలకు 8 గంటల షిప్ట్ లు అమలవుతున్నాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. తాజాగా నవీ ముంబైలోనూ తాజా పని గంటల అమలుకు ఆదేశాలు ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసుల కొరత వేధిస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం మహిళా పోలీసులకు ఈ వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది.
మహారాష్ట్రలో కొంతకాలంగా నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి తోడు క్రిమినల్ గ్యాంగులు, మాఫియా చర్యలతో పోలీసులపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. అయినా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ ధాక్రే ప్రభుత్వం నేరాల అదుపు కోసం చర్యలు తీసుకుంటూనే ఉంది. కానీ అప్పటికే లంచాలకు అలవాటు పడిన పోలీసుల తీరుతో తాజాగా హో్మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వందకోట్ల వసూళ్ల వ్యవహారం వంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.