కర్ణాటక ప్రభుత్వంలో భారీ మార్పులు, నా సత్తా చూపిస్తా, వినాయక చవితి: సీఎం ఇబ్రహీం!
బెంగళూరు: వినాయక చవితి పండుగ తరువాత కర్ణాటక ప్రభుత్వంలో భారీ మార్పులు జరుగుతాయి, వాటిని మీరు ఆసక్తిగా చూస్తూ ఉండాలని, ఆ సమయం ఎంతో దూరంలో లేదని, నా సత్తా ఏమిటో చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విధాన పరిషత్ సభ్యుడు (ఎమ్మెల్సీ) సీఎం. ఇబ్రహీం బాంబు పేల్చారు.

మేము విగ్రహాలు
కర్ణాటక ప్రభుత్వంలో మైనార్టీలు విగ్రహాలుగా మారిపోయారని, మా మతం వారికి సరైన పదవులు దక్కలేదని సీఎం. ఇబ్రహీం అసహనం వ్యక్తం చేవారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన సీఎం. ఇబ్రహీం కర్ణాటకలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

మూడు కులాలు
కర్ణాటక ప్రభుత్వంలో లింగాయుత, ఒక్కలిగ (గౌడ), బ్రాహ్మణులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని సీఎం. ఇబ్రహీం ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వంలో ముస్లీంలకు ప్రాధాన్యత లేదని ఎమ్మెల్సీ సీఎం. ఇబ్రహీం అసహనం వ్యక్తం చేశారు.

ఎందుకు పక్కన పెట్టారు ?
కర్ణాటకలోని ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి ప్రభుత్వంలో యుటి. ఖాదర్, జమీర్ అహమ్మద్ ఖాన్ లు మంత్రులుగా ఉన్నారు. మైనారిటీలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలను ఎందుకు పక్కన పెట్టారని, మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని సీఎం. ఇబ్రహీం ప్రశ్నించారు.

సీఎం కు సవాల్ !
ప్రస్తుతం తాను ఉత్తర కర్ణాటక పర్యటనలో ఉన్నానని, సెప్టెంబర్ లో ఆ పర్యటన పూర్తి అయిన తరువాత తన సత్తా ఏమిటో చూపిస్తానని సీఎం. ఇబ్రహీం కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి సవాలు విసిరారు. తాను మంత్రి పదవి ఆశించలేదని సీఎం. ఇబ్రహీం స్పష్టం చేశారు.

సముద్రంలో సంచి !
నాకు సంబంధించిన అతి పెద్ద మూట సంచి జారిపోయిందని, సముద్రంలో దాని కోసం వెతుకుతున్నానని, సెప్టెంబర్ నెలలో అది నా చేతికి చిక్కుతుందని, తరువాత తన ప్రతాపం చూపిస్తానని సీఎం. ఇబ్రహీం చాలెంజ్ చేశారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అత్యంత సన్నిహితుడు అయిన సీఎం. ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలతో ఇప్పుడు కర్ణాటకలో ఈ ప్రభుత్వంలో మార్పులు జరుగుతాయా అంటూ జోరుగా చర్చ మొదలైయ్యింది.












Click it and Unblock the Notifications