సిగరేట్ తాగిన పోలీసు: సస్పెండ్ చేసిన ఎస్పీ
బెంగళూరు: జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) కార్యాలయంలోకి పని మీద వెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. అతను చేసిన తప్పు ఎస్పీ కార్యాలయం బయట ఉన్న టీ కొట్టులో టీ తో పాటు హాయిగా సిగరేట్ తాగి వెళ్లడమే.
జిల్లా ఎస్పీ కార్యాలయంలో సిగరేట్ వాసన గుప్పు మనడంతో పోలీసు అధికారికి చిర్రెత్తి అతనిని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. మండ్య జిల్లా మళవళ్లి పట్టణ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న చిక్కపుట్టణ్ణ శెట్టి సస్పెండ్ అయ్యాడు.
హెడ్ కానిస్టేబుల్ చిక్కపుట్టణ్ణశెట్టి పని మీద జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయంలోకి వెళ్లకముందు బయట టీతో పాటు సిగరేట్ తాగాడు. ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి చాంబర్ లోకి వెళ్లే సమయంలో సిగరేట్ వాసన అలాగే ఉంది.
విషయం గుర్తించిన జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి నువ్వు సిగరేట్ తాగి వచ్చావా అంటూ క్లాస్ ఇచ్చారు. దేశం మొత్తం పబ్లిక్ గా సిగరేట్ తాగరాదని ప్రచారం చేస్తున్నారని, సిగరేట్ తాగే వారి దగ్గర పోలీసులు అపరాద రుసం వసూలు చేస్తున్నారని గుర్తు చేశారు.
అలాంటిది ఎస్పీ కార్యాలయం దగ్గర సిగరేట్ తాగి నేరుగా లోపలికి వచ్చినందుకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నానని ఆదేశాలు జారీ చేశారు. నియమాలు పాటించలేని మీరు ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని సుధీర్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని మండ్య జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.