బ్రిక్స్ లో పాల్గొనడానికి వచ్చి.. రాహుల్, ప్రియాంక గాంధీతో బ్రేక్ఫాస్ట్ చేసిన ఆ దేశ ప్రధాని
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమ్మిట్.. నేడు ముగియనుంది. మొదటి రోజు సెషన్ లో పలు అంశాలపై చర్చలు జరిగాయి. వాటన్నింటినీ క్రోడీకరించిన ఓ తీర్మానాన్ని ఈ సదస్సు ఆమోదించింది. ఆవిష్కరణలు, పరస్పర సహకారం, సుస్థిరత, సంక్షోభాలను ఉమ్మడిగా ఎదుర్కొనడం.. అనే నాలుగు అంశాలపై భారత్ దృష్టి సారించింది ఇందులో. దీనికి అనుగుణంగానే ఢిల్లీ డిక్లరేషన్ రూపొందింది.
కాగా.. బ్రిక్స్ లో పాల్గొనడానికి భారత్ కు వచ్చిన మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదయం ఉదయం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలతో భేటీ అయ్యారు. న్యూఢిల్లీలో ఈ సమావేశం ఏర్పాటైంది. రాహుల్, ప్రియాంక గాంధీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు.

లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓ అత్యున్నత స్థాయి విదేశీ నాయకులతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మలేషియా ప్రధానితో పలు అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానంగా ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత పటిష్టం చేసుకోవలసిన అవసరాన్ని గుర్తు చేశారు.
బ్రిక్స్ లో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది మలేషియా. ఆసియా పసిఫిక్ రీజియన్ లో భద్రత, సహకారం, వాణిజ్యం, వంటి రంగాల్లో భారత్ భాగస్వామిగా ఉంటోంది. ఈ క్రమంలో స్వయానా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో బ్రేక్ ఫాస్ట్ భేటీలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ప్రజల మధ్య సత్సంబంధాలు బలపడటం ద్వారా రెండు దేశాల విద్య, ఉద్యోగ రంగాలు మెరుగుపడతాయని మలేషియా ప్రధాని అభిప్రాయపడ్డారు.
అన్వర్ ఇబ్రహీం, రాహుల్ గాంధీకి మధ్య ఉన్న స్నేహం కొత్తదేమీ కాదు. గతంలో ఆయన భారత పర్యటనకు వచ్చినప్పుడూ రాహుల్ ను కలిశారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాను పొందిన తర్వాత జరిగిన మొదటి అధికారిక సమావేశం మాత్రం ఇదే కావడం గమనార్హం. ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రాంతీయ స్థిరత్వం వంటి అంశాలు కూడా ఈ సమావేశం సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.














Click it and Unblock the Notifications
