మమతా బెనర్జీపై సువేందు అధికారి భారీ విజయం ఖాయం, అదే బెంగాల్ అభివృద్ధికి బాట: అమిత్ షా
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి అతని ప్రత్యర్థి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని కేంద్రమంత్రి అమిత్ షా మంగళవారం ధీమా వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ఓటమి పశ్చిమబెంగాల్ అభివృద్ధికి ఎంతో అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
నందిగ్రాం పార్టీ కార్యాలయంలో మంగళవారం అమిత్ షా మీడియాతో మాట్లాడారు. మరోసారి అధికార పార్టీ ఇస్తున్న మూర్ఖపు వాగ్ధానాలను ప్రజలెవరూ నమ్మరని, బీజేపీకి భారీ విజయాన్ని రాష్ట్ర ప్రజలు కట్టబెట్టబోతున్నారని స్పష్టం చేశారు. నందిగ్రాంలో మమతా బెనర్జీని ఓడించడం ద్వారా పశ్చిమబెంగాల్ అభివృద్ధికి బాటలు వేయబోతున్నారని అన్నారు.

నందిగ్రాంలో మమతా బెనర్జీని ఓడిస్తే.. రాష్ట్రంలోని మిగితా ప్రాంతాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఓటమిపాలవుతున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. నందిగ్రాంలో జరిగిన అత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ.. మమతా బెనర్జీ ఇచ్చిన హామీలేమీయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా? అని నిలదీశారు.
మహిళల రక్షణ కోసం మమతా బెనర్జీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. కానీ, రాష్ట్రంలో మహిళల పరిస్థితి దయనీయంగా ఉంది. మమతా బెనర్జీ పోటీ చేస్తున్న నందిగ్రాంలోనే మహిళలపై దారుణాలు జరుగుతున్నాయన్నారు. కాగా, మమతా బెనర్జీ, మాజీ టీఎంసీ కీలక నేత, ప్రస్తుత బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి నందిగ్రాంలో జరుగుతున్న పోటీపైనే అందరి దృష్టి ఉంది.
అంతకుముందు ప్రచారానికి చివరి రోజుకావడంతో అమిత్ షా నందిగ్రాంలో భారీ రోడ్ షో నిర్వహించారు. కాగా, అమిత్ షా రోడ్ షోలో పాల్గొనే వేదికను దాటుకుంటూ మమతా బెనర్జీ ముందుకెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారు. నినాదాలు చేస్తూ.. ఆమె రోడ్ షోను వెంబడించారు. నందిగ్రాం నియోజకవర్గంలో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే తొలి దశ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications