దారి తప్పిన మమతా హెలికాఫ్టర్...బంగ్లాదేశ్ సరిహద్దులో గుర్తింపు
కోల్కతా: ఎన్నికల వేళ నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇందుకోసం చాపర్లను విరివిగా వినియోగిస్తున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాఫ్టర్లో బయలు దేరారు. ఉత్తర దినాజ్ పూర్లో ఆమె బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండగా ఆమె బయలు దేరిన హెలికాఫ్టర్ దారి తప్పింది. దీంతో ఒక్కసారిగా తృణమూల్ కాంగ్రెస్ క్యాడర్లో ఆందోళన మొదలైంది.
ఇక కొంత సమయం తర్వాత హెలికాఫ్టర్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో గుర్తించడం జరిగిందని మమతా బెనర్జీ క్షేమంగా ఉన్నారంటూ ప్రకటన విడుదలవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సిలిగురి నుంచి మధ్యాహ్నం 1:05 గంటలకు మమత ప్రయాణిస్తున్న చాపర్ టేకాఫ్ తీసుకుంది. చోప్రా ప్రాంతానికి 1:27 గంటలకు చేరుకోవాల్సి ఉంది. కానీ సమయం దాటిపోయినప్పటికీ మమతా హెలికాఫ్టర్ సభా స్థలికి చేరుకోకపోవడంతో ఆందోళన మొదలైంది. హెలికాఫ్టర్ దారి తప్పడంతో అరగంట ఆలస్యంగా సభాస్థలికి చేరుకున్నారు మమతా బెనర్జీ.

ఆలస్యమైనందుకు తనను క్షమించాల్సిందిగా కోరిన మమతా బెనర్జీ... ఈ స్థలాన్ని పైలట్ గుర్తించలేకపోయారని చెప్పారు. ఈ క్రమంలోనే హెలికాఫ్టర్ దారి తప్పినట్లు తెలిపారు మమతా బెనర్జీ. సిలిగురి నుంచి 22 నిమిషాల్లో తాను చేరుకోవాల్సి ఉండగా దాదాపు 55 నిమిషాల సమయం పట్టిందని మమతా అన్నారు. హెలికాఫ్టర్ బీహార్ గగనతలంలోకి పొరపాటున ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పలుమార్లు కమ్యూనికేషన్ వ్యవస్థతో టచ్లోకి వచ్చిన తర్వాత పైలట్ సభాస్థలిని గుర్తించి సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు సమాచారం. ఘటనపై హైలెవెల్ ఎంక్వైరీకి అధికారులు ఆదేశించారు.












Click it and Unblock the Notifications