ఎగ్జిట్ పోల్స్ వేళ.. బాంబు పేల్చిన మమత బెనర్జీ
పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ చివరదిశకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల వరకు 89.99 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 142 నియోజకవర్గాలకు పోలింగ్ ప్రక్రియ ఇంకాస్సేపట్లో ముగియబోతోంది. ఉదయం నుంచీ కూడా బెంగాల్ వ్యాప్తంగా పలు చెదురుమదురు ఘటనలు నమోదయ్యాయి. కొన్నిచోట్ల తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ పడ్డారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు, భద్రత బలగాలు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) చీఫ్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో కోల్ కతలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన కంచుకోట భవానీపూర్ నుంచి ఆమె ఈ దఫా కూడా బరిలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన సువేందు అధికారిని ఆమె ఎదుర్కొంటోన్నారు. 2021లో ఆమె ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారు కూడా. ఇప్పుడు గట్టిపోటీ ఇచ్చారు.

కోల్ కతలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మమత బెనర్జీ మాట్లాడారు. విక్టరీ సింబల్ ను ప్రదర్శించారు. ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతోన్నామని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తమకు అందిన సమాచారం ప్రకారం బెంగాల్లో బీజేపీ ఓడిపోతోందని తేల్చి చెప్పారు. మూడొంతుల మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ కేంద్ర బలగాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఆర్పీఎఫ్, కేంద్ర పరిశీలకులు ప్రజలను, మహిళలు, పిల్లలను కూడా కొడుతున్నారని, పోలింగ్ కేంద్రాలకు రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటోన్నారని విమర్శించారు. పోలింగ్ కు ఒకరోజు ముందు రాత్రి నుంచి అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారని, తమ పార్టీ సానుభూతిపరులు చాలా మందిని కస్టడీలోకి తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని కోర్టు ధిక్కారంగా అభివర్ణించారు.
ఇలాంటి నిర్బంధ ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ చూడలేదని మమత ఆవేదన వ్యక్తం చేశారు. ఏ బూత్లో కూడా రాష్ట్ర పోలీసులు లేరని, కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలే అంతటా ఆధిపత్యం చెలాయిస్తున్నాయని ఆమె ఆరోపించారు. సరిహద్దులను కాపాడకుండా కేంద్ర బలగాలు ఒక రాజకీయ పార్టీకి భద్రత కల్పిస్తున్నాయని దీదీ విమర్శించారు. తాను 1984 నుండి ఎన్నికలలో పోటీ చేస్తున్నానని, పోలింగ్ సమయంలో ఇటువంటి భయానక వాతావరణం ఎప్పుడూ చూడలేదని అన్నారు.












Click it and Unblock the Notifications