సేఫ్: లోయలో పడ్డ ఎస్కార్ట్ వాహనం, ప్రణబ్కు మోడీ ఫోన్
డార్జిలింగ్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కాన్వాయ్లోని కారు ప్రమాదానికి గురవ్వడంతో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రణబ్ యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం ఉదయం డార్జిలింగ్లో రాష్ట్రపతి కాన్వాయ్కి చెందిన ఓ వాహనం లోయలో పడిపోయింది.
స్థానికంగా నాలుగు రోజుల పాటు జరిగిన ఓ కార్యక్రమాన్ని ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్ విమానం ఎక్కేందుకు బాగ్డోగ్రాకు వెళ్తన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రపతి కాన్వాయ్లో ఉన్న మూడో వాహనం ఓ మూల మలుపు దగ్గర అదుపు తప్పి లోయలో పడింది. వంద అడుగుల లోతులోకి కారు పడిపోయింది.
ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. కారులో ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన సెక్యూరిటీ ఆఫీసర్, స్థానిక పోలీసులు ఉన్నారు. లోయలో పడిన వారిని భద్రతసిబ్బంది 45 నిమిషాల్లో కాపాడి బయటకు తీశారు. వెనువెంటనే స్పందించిన స్థానికులు సదరు వాహనంలో ఉన్న గార్డులను క్షణాల్లో బయటకు లాగేశారు.
అనంతరం ఆస్పత్రికి తరలించారు. కాగా కాన్వాయ్లోని ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైనా మిగిలిన వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో మమత పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షేమంగా ఉన్నట్లు రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ రాజామోనీ తెలిపారు.
లోయలో పడ్డ వాహనం రెండు చెట్లను ఢీకొన్న తర్వాత ఆగిపోయినట్లు తెలిసింది. రాష్ట్రపతి కాన్వాయ్ వెంట పశ్చిమ్బంగ సీఎం మమతాబెనర్జీ కాన్వాయ్ కూడా ఉంది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సురక్షితంగా బయటపడ్డారు. సీఎం మమతా బెనర్జీ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.
డార్జిలింగ్కు మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయనకు బెంగాల్ ప్రభుత్వం రిసెప్షన్ను ఏర్పాటు చేసింది.