రికార్డ్: సీఎంగా మమత ప్రమాణం, హాజరైన గంగూలీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ శుక్రవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆమె రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి రికార్డు సృష్టించారు. మమతతో పాటు 41 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. 2011లో లెఫ్ట్ పార్టీని కూలదోసిన మమతా బెనర్జీ... 2016లో మరోసారి వారిని ప్రతిపక్షానికి పరిమితం చేసింది.
రాష్ట్ర గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఆమెతోపాటు 41 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ యాదవ్, మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ తదితరులు హాజరయ్యారు.