India Today Survey: బెంగాల్ లో గెలిచేది ఎవరంటే ? తేల్చేసిన ఇండియా టుడే సర్వే..!
ఈ ఏడాది పశ్చిమబెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి దృష్టీ నెలకొంది. దీనికి ప్రధాన కారణం తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ నెక్ట్స్ టార్గెట్ బెంగాలే అంటూ ప్రధాని మోడీ చేసిన ప్రకటన. అదే సమయంలో వరుసగా మూడుసార్లు గెలిచి సీఎంగా కొనసాగుతున్న మమతా బెనర్జీని నాలుగోసారి గెలవకుండా అడ్డుకోవాలన్న పట్టుదల కూడా ఉంది. ఈ నేపథ్యంలో బెంగాల్లో జరిగే అసెంబ్లీ పోరును రాజకీయ పార్టీలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి.
బెంగాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న వేళ ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇండియా టుడే (india today) రెగ్యులర్ గా నిర్వహించే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే కూడా జరిగింది. ఇందులో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే బెంగాల్లో ఎవరు గెలవబోతున్నారనే అంశంపై సర్వే చేశారు. ఇప్పటివరకూ బెంగాల్లో లోక్ సభ ఎన్నికలకూ, అసెంబ్లీ ఎన్నికలకూ మధ్య ఫలితాల్లో పెద్దగా వ్యత్యాసం ఉండట్లేదు. దీంతో ఈ సర్వేను బెంగాల్లో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాభిప్రాయంగా భావిస్తున్నారు.

బెంగాల్లో ఇవాళ లోక్ సభ ఎన్నికలు జరిగితే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 2024లో సాధించిన విజయాన్ని పునరావృతం చేసే అవకాశం ఉందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే తేల్చేసింది. అప్పట్లో గెలిచిన అన్ని సీట్లను టీఎంసీ నిలుపుకుంటుందని ఇండియా టుడే తేల్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని 42 సీట్లలో టీఎంసీ 29 సీట్లు గెలుచుకుంది. బిజెపి 12 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఎన్నికలు జరిగినా అవే ఫలితాలు దాదాపుగా వస్తాయని సర్వేలో తేలింది.

ఇండియా టుడే తాజా సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ 28 ఎంపీ సీట్లు గెల్చుకునే అవకాశం ఉందని తేల్చింది. బీజేపీ రెండు సీట్లు పెంచుకుని 14 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. గత ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ఇండియా టుడే బీజేపీ 11 సీట్లు మాత్రమే గెలుస్తుందని, తృణమూల్ కు 31 సీట్లు వస్తాయని తెలిపింది. కానీ బీహార్ ఫలితాల తర్వాత ఈ స్వల్పమార్పు వచ్చినట్లు తెలుస్తోంది. అయినా ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ గెలుపు అవకాశాలకు వచ్చిన ఢోకా ఏదీ లేదని మాత్రం తేలిపోయింది.












Click it and Unblock the Notifications