షాకింగ్ ట్విస్ట్: మమతా బెనర్జీ ఓటమి -నందిగ్రామ్లో బీజేపీ సువేందు గెలుపు -ఈసీపై టీఎంసీ నిప్పులు, ఏమైందంటే..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గానూ అధికార టీఎంసీ ఏకంగా 213కుపైగా స్థానాల్లో ఆధిక్యంతో వరుసగా మూడో సారి అధికారాన్ని కైవసం చేసుకోగా, బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆమె పోటీ చేసిన నందిగ్రామ్ స్థానంలో ఫలితంపై గందరగోళం ఏర్పడింది..
నందిగ్రామ్లో హైడ్రామా..
బెంగాల్ లోని మిగతా 293 సీట్లు ఒకెత్తు, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం ఒకెత్తుగా ఎన్నికల పోరాటం జరిగింది. మమతకు ఒకప్పటి ప్రధాన అనుచరుడు, మాజీ మంత్రి అయిన సువేందు అధికారి బీజేపీలో చేరి సవాళ్లు విసరడంతో నందిగ్రామ్ లో పోటీకి మమత సై అన్నారు. పోరు హోరాహోరీగా జరగ్గా, ఆదివారం వెలువడిన ఫలితాల్లో నందిగ్రామ్ పై హైడ్రామా నడిచింది. మొత్తం 16 రౌండ్ల కౌంటింగ్ జరగ్గా, ఒక్కో రౌండ్ లో మమత, సువేందు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. ఒక దశలో మమత ఓడిపోతున్నట్లు, మరికాసేపటికే పుంజుకున్నట్లు గణాంకాలు వెలువడటం అందరినీ టెన్షన్ కు గురిచేసింది. చివరికి మమతా బెనర్జీ 1200 ఓట్లతో గెలుపొందినట్లు ఈసీ ప్రకటించిందని వార్తలు వచ్చాయి. కానీ..
సీఎం మమత ఓటమి.. సువేందు గెలుపు
నందిగ్రామ్ లో మమతా విజేతగా నిలిచినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించిన కొద్ది గంటలకే ఫలితం తారుమారైంది. నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 1,957 ఓట్ల తేడాతో మమతపై గెలుపొందారంటూ బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జి అమిత్ మాలవియా సంచలన ట్వీట్ చేశారు. ''ఇది బిగ్ న్యూస్. సీఎం మమతా బెనర్జీ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. అధికారం చేపట్టే నైతిక అర్హతను ఆమె కోల్పోయారు'' అంటూ బీజేపీ ఐటీ సెల్ చీఫ్ ట్వీట్ చేసిన కాసేపటికే ఎన్నికల సంఘం సైతం మమత ఓటమిని ఖరారు చేస్తూ ప్రకటన చేసింది. నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 1,957ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు ఈసీ ప్రకటించిందని వార్తలు వచ్చాయి. అయితే, ఈసీ మాత్రం తామింకా రివ్యూ చేస్తున్నామని పేర్కొంది. కాగా,
ఈసీపై దీదీ నిప్పులు.. న్యాయపోరాటం..
నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో ఫలితం ప్రకటనపై ఎన్నికల సంఘం అనుసరించిన విధానాన్ని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తప్పు పట్టారు. తొలుత తనను విజేతగా ప్రకటించి, మళ్లీ కొద్ది గంటల్లోనే ఫలితాన్ని రివైజ్ చేస్తూ, బీజేపీ గెలిచినట్లుగా ప్రకటించడాన్ని ఆమె గర్హించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ పూర్తిగా పక్షపాతంగా వ్యవహరించిందని మండిపడ్డ ఆమె.. ఈసీపై కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. నందిగ్రామ్ ఫలితం నిరాశజనకమే అయినప్పటికీ, ప్రజా తీర్పును శిరసావహిస్తానని, నందిగ్రామ్ ఓటమి పెద్ద మ్యాటర్ కాదని, బీజేపీని చిత్తుగా ఓడించిన టీఎంసీకి బెంగాల్ లో 221 సీట్లు వచ్చాయని మమత అన్నారు.