100 సీట్లు కూడా రావు... ఏపీ, తమిళనాడులో ఖాతాయే తెరవదు.. బీజేపీ ఫలితాలపై మమత జోస్యం
Recommended Video
కోల్కతా : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో విజయంపై పార్టీలు వేటికవే అంచనా వేసుకుంటున్నాయి. అందుకు తగ్గట్లుగా వ్యహరచన చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో మరోసారి అధికారం చేపడతామని ధీమాతో ఉన్న బీజేపీ ఫలితాలపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ జోస్యం చెప్పారు. బీజేపీకి పరాభవం తప్పదని తేల్చేశారు.
దీదీ వర్సెస్ మోదీ : మమతకు పెరుగుతున్న మద్దతు, అండగా ఉంటామన్న కేజ్రీవాల్
100సీట్లు కూడా రావు
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలవుతుందని మమత బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఈసారి ఆ పార్టీకి కేవలం 100సీట్లు కూడా రావని అన్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కమలదళం దారుణమైన ఫలితాలు చవిచూస్తుందన్నారు దీదీ. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో బీజేపీ కనీసం ఖాతా కూడా తెరవదని జోస్యం చెప్పారు. ఆ పార్టీ ఈసారి మహారాష్ట్రలో 20, దేశవ్యాప్తంగా 200స్థానాలు కోల్పోతుందని అంచనా వేశారు.
ఓట్ల కోసం నోట్లు
బెంగాల్లో గెలుపు కోసం బీజేపీ నేతలు అడ్డదారులు తొక్కారని మమత విమర్శించారు. ఓట్ల కోసం వారు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారని, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల్ని బెదిరిస్తూ గూండాల్లా వ్యవహరించారని ఆరోపించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలు వాటిని రుజువు చేయాలని దీదీ సవాల్ విసిరారు. నిరూపించకపోతే ఆరోపమలు చేసిన వారందరినీ కోర్టుకీడుస్తానని వార్నింగ్ ఇచ్చారు.
ప్రచారం ముగిసినా ఆగని అల్లర్లు
బెంగాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల సంఘం ప్రచారాన్ని గురువారం రాత్రికి కుదించింది. ప్రచారం ముగిసినా బెంగాల్లో హింస మాత్రం కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి బీజేపీ నేత ముకుల్రాయ్ కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మరో ఘటనలో బీజేపీ డమ్ డమ్ అభ్యర్థి సామిక్ భట్టాచార్యపై అగంతకులు దాడికి పాల్పడ్డారు. ఈ రెండు ఘటనల వెనుక టీఎంసీ హస్తం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.