మమతా వర్సెస్ సీబీఐ: 22 ఏళ్ల క్రితం సీబీఐ లాలూను ఎలా అరెస్టు చేసిందో తెలుసా..?
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐల మధ్య వార్ ముదురుతోంది. శారదా చిట్ఫండ్ స్కాములో ఎలక్ట్రానిక్ ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై విచారణ కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను విచారణ చేయాలనే పంతంతో సీబీఐ ఉంది. అయితే అతనికి రక్షణగా మమతా బెనర్జీ నిలిచారు. నేటి ఈ పరిస్థితులను చూస్తుంటే సరిగ్గా 22 ఏళ్ల క్రితం దాణా స్కామ్లో సీబీఐ లాలూ ప్రసాద్ యాదవ్ పట్ల వ్యవహరించిన తీరు ఎవరికైనా గుర్తురాక మానదు... నాడు లాలూ పట్ల సీబీఐ ఎలా వ్యవహరించింది..? నేడు మమతా పట్ల అలా ఎందుకు వ్యవహరించలేకపోతోంది...
దాణా స్కాములో లాలూ అరెస్టును గుర్తుకు తెస్తున్న మమతా ఎపిసోడ్
సీబీఐ మమతా బెనర్జీల మధ్య వార్ తారాస్థాయికి చేరింది. ఇలా చెప్పడంకంటే... కేంద్రంపై దీదీ కన్నెర్ర చేసిందనే చెప్పాలి. కేంద్రం కనుసన్నల్లో సీబీఐ పనిచేస్తోందంటూ దీదీ ఆరోపిస్తున్నారు. శారదా కుంభకోణం కేసులో పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ను విచారణ చేసేందుకు 40 మంది సీబీఐ అధికారులు ఆయన నివాసంకు చేరుకోవడంతో ఏకంగా ఆయనకు రక్షణ కల్పించేందుకు ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీనే కదిలారంటే ఆమెకు కేంద్రంపై ఏ పాటి కోపం ఉందో ఊహించొచ్చు. అయితే నాడు దాణా స్కాములో ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కేసులో సీబీఐ వ్యవహరించిన తీరు మమతా ఎపిసోడ్ గుర్తుచేస్తోంది.
లాలూ అరెస్టుకు ఆర్మీ సహకారం కోరిన సీబీఐ
సరిగ్గా 22 ఏళ్ల క్రితం దాణా స్కాములో నాటి సీఎంగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్పై ఆరోపణలు రావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆ వెంటనే తన భార్య రబ్రీదేవిని సీఎంగా గద్దెనెక్కించారు. ఇక ఐదురోజుల తర్వాత సీబీఐ లాలూను అరెస్టు చేసేందుకు వచ్చింది. అయితే రబ్రీ సర్కారు సీబీఐకు సహకరించలేదు. దీంతో లాలూను అరెస్టు చేసేందుకు సీబీఐ భారత ఆర్మీ సహకారం కోరింది. దానా కేసును నాటి సీబీఐ జాయింట్ డైరెక్టర్ బిశ్వాస్ నేతృత్వంలో విచారణ జరిగింది. ఇక లాభం లేదని భావించిన బిశ్వాస్ లాలూను అరెస్టు చేయాలని భావించారు. అయితే ఇది 90వ దశకంలో జరిగిన ఎపిసోడ్.
భారత ఆర్మీ సహకారం తీసుకోండంటూ నాటి సీఎస్ సలహా
90వ దశకంలో లాలూ ఓ ముఖ్యనేతగా బీహార్ రాష్ట్రాన్ని ఏలుతున్నారు. లాలూను అరెస్టు చేయాలని 1997లో రాష్ట్రప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా అందుకు ప్రభుత్వం తిరస్కరించింది. అంతకుముందు లాలూ అరెస్టుకు సహకరించాల్సిందిగా అడిగేందుకు బీహార్ ఛీఫ్ సెక్రటరీ బీపీ వర్మ కార్యాలయానికి వెళ్లగా సీఎస్ అక్కడ లేరని కార్యాలయ సిబ్బంది తెలిపింది. ఆ తర్వాత నాటి డీజీపీ సక్సేనాను కలుద్దామని అనుకున్నప్పటికీ డీజీపీ తనకు సమయం లేదంటూ వెళ్లిపోయారు. అన్ని ప్రయత్నాల తర్వాత చివరకు సీఎస్ బిస్వాస్ సీబీఐలోని ఓ అధికారికి ఫోన్ చేసి లాలూ అరెస్టుకు భారత ఆర్మీ సహకారం తీసుకోండంటూ సమాచారం ఇచ్చారు.
ఇక కోర్టుకు వెళ్లి సీబీఐ అనుమతులు పొందడం.. భారత ఆర్మీ సహకారం కావాలంటూ ఆర్మీకి లేఖ రాయడం జరిగిపోయాయి. అయితే బీహార్ ప్రభుత్వం కోరితేనే తమ సహకారం ఉంటుందని ఆర్మీ బదులు ఇవ్వడంతో చేసేదేమి లేక తిరిగి సీబీఐ కోర్టులో అధికారులు పిటిషన్ వేశారు. దీంతో సీబీఐ కోర్టు బీహార్ డీజీపీకి సీబీఐ కోర్టు షోకాజ్ నోటీసులు పంపింది. పోలీసులు విచారణాధికారులతో ఎందుకు సహకరించడంలేదని మందలించింది. దీంతో సీఎస్ బిస్వాస్ వెంటనే నిర్ణయం తీసుకుని లాలూ అరెస్టుకు సహకరించారు. ఇలా లాలును తన సొంత గడ్డపైనే అరెస్టు చేయించి హీరో అయ్యారు బిస్వాస్.
నాటి బీహార్ సీఎస్ ఇప్పుడు అదే సీబీఐపై పోరాడుతున్నారు
రిటైరయ్యాక ఆయన సొంత రాష్ట్రం బెంగాల్కెళ్లి స్థిరపడ్డారు. ఆ తర్వాత మమత బెనర్జీ కేబినెట్లో 2011 నుంచి 2016 మధ్య మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు కూడా బిస్వాస్ మమతకు ఏమైనా సలహాలు ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. కానీ 22 ఏళ్ల క్రితం నాటికి ఇప్పటికీ పరిస్థితులు మారిపోయాయి. నాడు లాలూ అరెస్టులో సీబీఐకి సహకరించిన బిస్వాస్ ఇప్పుడు మమత పక్కన ఉంటూ అదే సీబీఐపై వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే బిస్వాస్, మమతలతో పాటు లాలూ కుమారుడు తేజస్వీయాదవ్ కూడా వారితో కలిసి సీబీఐకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.