అంబులెన్స్ లో మహిళపై లైంగిక దాడి, భర్త ముందు !
బెంగళూరు: అనారోగ్యంతో అంబులెన్స్ లో స్పృహ కోల్పోయిన మహిళ మీద కామాంధుడు అత్యాచారాయత్నం చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. రోగిపై అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించిన అళచేనహళ్ళి నివాసి సిద్దరాజు (32) అనే కామాంధుడిని బెంగళూరులోని బనశంకరి పోలీసులు అరెస్టు చేశారు.
బెంగళూరు నగరంలోని సుబ్రమణ్యపుర మెయిన్ రోడ్డులో 42 ఏళ్ల మహిళ నివాసం ఉంటున్నారు. ఈమె వేకువ జామున అస్వస్థతకు గురి కావడంతో ఆమె భర్త వెంటనే ప్రయివేటు ఆసుపత్రికి తరలించడానికి ఇంటి దగ్గరకు అంబులెన్స్ పిలిచారు.
తరువాత ఆమె భర్త, అంబులెన్స్ డ్రైవర్ పక్క సీటులో కుర్చుని పధ్మనాభనగర్ లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు బయలుదేరారు. ఆ సమయంలో వెనుక అనారోగ్యంతో ఉన్న మహిళ స్పృహ కోల్పోయింది.
మహిళ పక్కన అంబులెన్స్ డ్రైవర్ స్నేహితుడైన నిందితుడు సిద్దరాజు కుర్చుని ఉన్నాడు. అదే అదునుగా భావించిన నిందితుడు సిద్దరాజు స్పృహ కోల్పోయిన మహిళ మీద అత్యాచారయత్నం చేశాడు.
ఆమె స్పృహలోకి వచ్చి గట్టిగా కేకలు వేసింది. అయితే డ్రైవర్, రోగి భర్త ఉన్న ప్రాంతం ప్రత్యేక క్యాబిన్ లాగా విభజించి ఉండటంతో ఆమె కేకలు వినిపించలేదు. చివరికి ఆసుపత్రి దగ్గర సిద్దరాజు అంబులెన్స్ దిగి అక్కడి నుంచి పరారైనాడు.
తరువాత విషయం తెలుసుకున్న రోగి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అంబులెన్స్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేసి నిందితుడి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడు సిద్దరాజు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు.
ఆసుపత్రి దగ్గర ఉన్న పార్క్ లో అప్పుడప్పుడు సిద్దరాజు విశ్రాంతి తీసుకుంటున్నాడని పోలీసులు చెప్పారు. ఆసమయంలో అంబులెన్స్ డ్రైవర్ తో పరిచయం చేసుకుని అప్పుడప్పుడు కొంత సేపు అంబులెన్స్ లో సిద్దరాజు విశ్రాంతి తీసుకునే వాడని పోలీసులు గుర్తించారు.
నిందితుడు సిద్దరాజును గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో పరుగు తీసిన సిద్దరాజు కాలుజారి కిందపడిపోవడంతో గాయాలైనాయి. వెంటనే అతన్ని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సిద్దరాజుకు చికిత్స చేసిన తరువాత అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని బనశంకరి పోలీసులు చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సిద్దరాజు మీద అత్యాచారయత్నం, లైంగిక దాడి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.