గోసంరక్షకుల మూకుమ్మడి దాడి: రాజస్థాన్లో ఘోరం, ముస్లిం యువకుడి మృతి
గోసంరక్షకులు చేసిన దాడిలో పెహ్లూ మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
జైపూర్: ఆవులను అక్రమంగా తరలిస్తున్నాడని ఆరోపిస్తూ కొంతమంది గో సంరక్షకులు ఓ ముస్లిం వ్యక్తిని హతమార్చారు. గో సంరక్షకులు మూకుమ్మడిగా అతని మీద దాడి చేయడంతో ముస్లిం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానిక జిల్లా కలెక్టర్ ముక్తానంద్ అగర్వాల్ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పెహ్లూ ఖాన్(50) మరికొందరితో కలిసి ఆరు వాహనాల్లో ఆవులను తరలించేందుకు ఏర్పాట్లు చేశాడు. విషయం తెలుసుకున్న కొంతమంది గో సంరక్షకులు పెహ్లూను అడ్డగించి, ఆపై దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా అతని మీద దాడి చేయడంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
గోసంరక్షకులు చేసిన దాడిలో పెహ్లూ మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడినవారిని హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాకు చెందిన ముస్లింలుగా గుర్తించారు.
అయితే ముస్లిం యువకులు ఆవులను ఎక్కడికి తరలిస్తున్నారన్నది తెలియాల్సి ఉంది. కాగా, రాజస్థాన్ లోను గోవధ నిషేధం కొనసాగుతోంది. ముస్లిం యువకులపై దాడి చేసిన ఆరుగురు గోసంరక్షకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 200మందిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అదుపులోకి తీసుకున్నవారిని హిందూ జాగరణ్, భజరంగ్ దళ్ కార్యకర్తలుగా గుర్తించినట్లు తెలుస్తోంది.