సిద్ధూ ఆగ్రహం!: ముఖ్యమంత్రికి అజ్ఞాత వ్యక్తి శాపం
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంటి వద్ద శపించారని, ఇది ఆయన మద్దతుదారుల్లో ఆందోళన కలిగిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఆ శపించిన వ్యక్తి రాష్ట్రంలో చేతబడులకు పేరుగాంచిన కొల్లెగల ప్రాంతానికి చెందినవాడని తెలుస్తోంది.
మైసూరులోని సిద్ధరామయ్య ఇంటి వద్దకు వచ్చిన ఆ వ్యక్తి ఓ వస్త్రాన్ని ఇవ్వగా.. స్వీకరించలేదు. దీంతో కోపగించుకున్న అతను కారు డ్రైవర్ పక్కన కిటికీ నుంచి ముఖ్యమంత్రిని శపించాడాని అంటున్నారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి పట్టించుకోలేదు.
అయితే, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల 14 మందిని కేబినెట్ నుంచి తొలగించి, 13 మందిని తీసుకోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో మళ్లీ ఇది చోటు చేసుకుంది.
సీఎం నివాసం వద్ద బారీకేడ్లలో నుంచి దూసుకుపోయి, సెక్యూరిటీ నుంచి తప్పించుకొని ఓ వ్యక్తి వచ్చి అప్పుడే కారులోకి ఎక్కుతున్న సిద్ధరామయ్యను కలిసి పూజ చేసిన వస్త్రాన్ని కప్పుకోవాలని ఇచ్చాడు. ఇలాంటి వాటి మీద నమ్మకం లేదని ముఖ్యమంత్రి, దానిని నిరాకరించారు.
ఆ తర్వాత తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని, సాయం చేయాలని కోరాడు. దీనిపై సిద్ధరామయ్య... ఇలాంటి వాళ్లు చాలామంది ఉంటారని, ఇతను గత నాలుగేళ్లుగా ఇలాగే చేస్తున్నాడని వ్యాఖ్యానించారని వార్తలు వస్తున్నాయి. దాంతో ఆ వచ్చిన వ్యక్తి సీఎంను శపించాడని అంటున్నారు. శాపం ఇచ్చిన వ్యక్తి దానిని వెనక్కి తీసుకోవాలని మద్దతుదారులు అంటున్నారు.