'పెళ్లి' చేసుకుంటానని చెప్పి.. నలుగురు యువతులను రేప్ చేశాడు..
పెళ్లి పేరిట మోసాలకు పాల్పడుతూ యువతుల మీద అత్యాచారాలకు తెగబడుతున్న అమిత్ జాదవ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పూణే: పెళ్లి పేరుతో అమ్మాయిలకు వలవేసి ఆ తర్వాత అందినకాడికి దోచుకుని పరారయ్యే ఓ యువకుడి ఉదంతం మహారాష్ట్రలోని పూణేలో వెలుగుచూసింది. బారామతికి చెందిన అమిత్ జాదవ్(28) అనే ఆ యువకుడు ఇప్పటిదాకా చాలామంది యువతులను ఇదే తరహాలో మోసగించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది.
తొలుత ఓ మ్యాట్రిమోనియల్ సైట్ లో తన పేరు రిజిస్టర్ చేయించుకున్న సదరు వ్యక్తి.. కొద్దికాలంలోనే ఓ అమ్మాయికి వల వేశాడు. తానో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటూ అమ్మాయికి దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలతో మరింత సాన్నిహిత్యం పెరిగింది. ఇలా సాగిపోతున్న క్రమంలో.. ఓరోజు ఉన్నట్టుండి తాను పనిచేస్తున్న సంస్థ తరుపున రెండేళ్ల పాటు విదేశాలకు వెళ్తున్నానని చెప్పాడు.
కాబట్టి.. ఈలోపు నిశ్చితార్థం చేసుకుందామని మాయ మాటలతో ఆమెను తన ఫ్లాటుకు రప్పించాడు. అలా.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం వీసా అని నాటకాలాడి ఆమె వద్ద నుంచి భారీగా డబ్బు తీసుకున్నాడు. ఆ తర్వాత రెండు నెలలకే నీకు-నాకు కుదరదు అంటూ ప్లేటు ఫిరాయించాడు.
దీంతో మోసపోయానని గుర్తించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో అమిత్ జాదవ్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అమిత్ జాదవ్ మరో యువతితో పోలీసులకు పట్టుబడటం గమనార్హం. అయితే సదరు యువతి జాదవ్ పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.
అయితే పోలీసుల విచారణలో తేలిందేంటంటే.. అమిత్ జాదవ్ గతంలో కూడా ఇలా మాయ మాటలతో నలుగురు యువతులను మోసం చేశాడని పోలీసులు గుర్తించారు. అమిత్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కాదని తేల్చారు. ప్రస్తుతం అతన్ని అరెస్టు చేసి మరిన్ని వివరాలు రాబడుతున్నారు.