వివాహితతో అసభ్యం: గాడిదపై నగ్నంగా ఊరేగింపు
జైపూర్: ఓ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని గ్రామస్థులు నగ్నంగా గాడిదపై ఊరేగించారు. ఈ ఘటన రాజస్థాన్లోని సికార్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. సికార్ జిల్లాలోని రామ్గడ్ షేఖావతి గ్రామానికి చెందిన ఓ 24 ఏళ్ల వివాహితని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తరచూ ఫోన్లు చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దీంతో ఆ మహిళ విసిగిపోయి అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. అదే నెంబరుకి ఫోన్ చేసి కలుసుకుందామని చెప్పింది. చెప్పిన స్థలానికి అతను చేరుకోగానే మహిళ తన తల్లిదండ్రులతో కలిసి అతనిని చితకబాదింది.
ఆ తర్వాత అతడ్ని గాడిదపై నగ్నంగా ఊరేగించారు. సమాచారం అందుకున్న రామ్గడ్ పోలీసు అధికారి విచారణ చేపట్టి విద్యాధర్ బాలాయ్, ప్రకాశ్ చాంద్(22), మహమ్మద్ మునాఫ్(21) అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
గుడిసెలు తొలగిస్తుండగా చిన్నారి మృతి
న్యూఢిల్లీ: షాకూర్ బస్తీలో దారుణం జరిగింది. రైల్వే స్థలాల్లో అక్రమంగా నిర్మించిన గుడిసెలను రైల్వే అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా తొలగించారు. సుమారు 500గుడిసెలను నేలమట్టం చేశారు. గుడిసెలను తొలగిస్తుండగా ఓ చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతి చెందడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుడిసెలు తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం సాయంత్రమే గుడిసెలు తొలగించడంతో బాధిత కుటుంబాలు చలిలోనే ఉండిపోయారు.
ఇక తొమ్మిది నెలల క్రితమే గుడిసెలు తొలగించాలని నోటీసులు జారీ చేశామని రైల్వే అధికారులు తెలిపారు. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఫలితం లేదని తెలిపారు. గుడిసెలు నిర్మించిన ప్రాంతంలో ప్రయాణికుల కోసం కొత్త టెర్మినల్ను నిర్మించబోతున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే గుడిసెలు తొలగించామని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.