చొక్కా కాలర్ పట్టుకున్నాడని.. కాల్చేసిన ఎస్సై
న్యూఢిల్లీ: తమిళనాడులోని రామాంతపురం జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ క్షణికావేశంలో ఓ వ్యక్తిని చంపడంతో ఎస్సైని సస్పెండ్ చేసి, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రామాంతపురం జిల్లా కలెక్టర్ కె. నందకుమార్ జిల్లా ఎస్పీని ప్రాధమిక నివేదిక తయారుచేసి ఛీప్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు అందించాలని ఆదేశించినట్లు తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు విధివిధానాలను అనుసరించి, సయ్యద్ మహమ్మద్ను కాల్చి చంపి సస్పెన్షన్ గురైన ఆ ఎస్సెపై దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకుంటామని అన్నారు.
చిన్నఘర్షణ కారణంగా ఎస్పీ పత్తినం గ్రామంలో ఓ షాప్ ఓనర్ ఫిర్యాదు మేరకు సయ్యద్ మహ్మద్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్కు పిలిపించాడు ఎస్సై కాళిదాస్. పోలీస్ స్టేషన్కు వెళ్ళిన మహ్మద్ను ఎస్సై విచారణ సమయంలో గద్దెంచాడు.
ఓ దశలో సర్వీస్ పిస్టల్ చూపి బెదిరించాడు. దీంతో, మహ్మద్ ఆవేశంగా ఎస్సై కాళిదాస్ షర్టు పట్టుకున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన, ఆ సబ్ ఇన్ స్పెక్టర్ విచక్షణ కోల్పోయాడు. వెంటనే పిస్టల్ను మహ్మద్కు గురిపెట్టి రెండు రౌండ్లు కాల్చాడు. దీంతో, సయ్యద్ మహమ్మద్ అక్కడిక్కడే మరణించాడు.
ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి చేరుకున్న ఎస్సై కాళిదాసు విచారణ సమయంలో సయ్యద్ మహమ్మద్ తనపై కత్తితో దాడి చేయడం వల్లనే అతన్ని కాల్చి చంపాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
షాఫ్ ఓనర్ అరుల్దాస్ ఫిర్యాదు మేరకు సయ్యద్ మహమ్మద్పై కేసు నమోదు చేశామని పోలీస్ స్టేషన్లోని సీనియర్ అధికారి తెలిపారు. సయ్యద్ మహమ్మదే దర్యాప్తు చేస్తున్న సమయంలో ఎస్సై కాళిదాసును కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా తప్పనిసరి పరిస్దితుల్లో ఎస్సై రెండు రౌండ్లు కాల్చాడని చెప్పారు.
దీంతో రామాంతపురం కలెక్టర్ అసలు ఏమి జరిగిందో ప్రాధమిక దర్యాప్తు ద్వారా నివేదికను తయారు చేసి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు పంపమని జిల్లా ఎస్పీ మయిల్ వాహనన్ను ఆదేశించారు.