వీరి మధ్య ఏంటి సంబంధం: మహిళను తన నాలుగేళ్ల కొడుకు ముందే చంపిన వ్యక్తి..ఆపై...
ఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరో మహిళను కత్తితో పొడిచి చంపాడు. ఆమె నాలుగేళ్ల కొడుకు ముందు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తను కూడా చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉంటే ఆ వ్యక్తి చేతిలో ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నందున కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో రాశారు. తమ మృతి తర్వాత ఇద్దరినీ ఒకే దగ్గర సమాధి చేయాలని రాసినట్లు ఉంది. అయితే మహిళకు ఆ వ్యక్తికి మధ్య సంబంధం ఏమిటనేది ఇంకా స్పష్టం చేయలేదు. పొడిచిన వ్యక్తి పేరు సన్నీ అని పోలీసులు చెప్పారు.
శుక్రవారం ఉదయం జరిగిన హత్య
మృతి చెందిన మహిళను 24 ఏళ్ల పింకీ చౌహాన్గా గుర్తించారు. ఆమె చిరాగ్ దిల్లీలోని ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నట్లు సమాచారం. తన భర్త రవీందర్తో కలిసి ఈ మధ్యే చిరాగ్ దిల్లీలోని ఓ అద్దె ఇంట్లో చేరినట్లు సమాచారం. రవీందర్ ఓ ఆటోమొబైల్ కంపెనీలో మెకానిక్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 9:50 గంటలకు తమకు హత్య గురించి ఫోన్ వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. అయితే అంతకుముందు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందనే సమాచారంను ఫోన్ చేసిన వారు చెప్పారని వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు తెలిపారు. ఇద్దరి రక్తపుమడుగులో పడిఉన్నట్లు పోలీసులు చెప్పారు. వెంటనే ఎయిమ్స్కు తరలించగా అప్పటికే పింకీ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో వైపు సన్నీకి చికిత్స అందిస్తున్నారు.
ఇద్దరి మధ్య ఏంటి సంబంధం..?
ఇదిలా ఉంటే అంబేడ్కర్ నగర్లో డ్రైవర్గా పనిచేస్తున్న సన్నీతో మృతురాలు పింకీకి నాలుగేళ్లుగా పరిచయం ఉందని పోలీసులు తెలిపారు. పింకీ భర్త ఇంట్లో లేని సమయంలో సన్నీ లోపలికి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పింకీ సన్నీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుందని, ఈ క్రమంలోనే ఓ పొడువైన కత్తిని తీసుకుని పింకిని ఆరుసార్లు పొడిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఆ తర్వాత తన గొంతును చేతిని కోసుకున్నట్లు వారు వెల్లడించారు. అయితే సూసైడ్ నోట్లో మాత్రం ఇద్దరినీ ఒకే దగ్గర సమాధి చేయాలని రాసి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు ఇప్పటికే తాను అప్పుల్లో కూరుకుపోయి ఉన్నట్లు లేఖలో పేర్కొన్న సన్నీ...పింకీ భర్త తన దగ్గర తీసుకున్న అప్పును తిరిగి చెల్లించలేదని పేర్కొన్నాడు. అయితే పింకీ సన్నీల మధ్య సంబంధం, వారి కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సన్నీ కోసం పింకీ భర్తను వదిలేసింది
పింకీ భర్తకు ఈ మధ్యే సన్నీ పరిచయం అయ్యాడని పోలీసులు చెప్పారు. అయితే సన్నీని పెళ్లి చేసుకునేందుకు పింకీ తన భర్త రవీందర్ను వదిలేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు చెబుతున్నారు. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో తిరిగి భర్త దగ్గరకు పింకీ చేరుకున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే సన్నీని ఇంతకుముందు చూడలేదని ఇంటి యజమానురాలు చెప్పారు. ముందుగా గట్టిగా అరుపులు వినపడ్డాయని అయితే పింకీ రవీందర్ల మధ్య ఏదో చిన్నపాటి గొడవై ఉంటుందని తాము అనుకున్నామని ఫస్ట్ఫ్లోర్లో నివాసముండే వ్యక్తి చెప్పారు. గట్టిగా కేకలు వినపడటంతో తన భార్యను ఏమైందో చూసి రమ్మని పంపగా ఆమె గట్టిగా కేకలు వేస్తూ తనను పిలిచిందని చెప్పాడు ఆ వ్యక్తి. వెళ్లి చూడగా ఇద్దరూ ఓ బెడ్పై రక్తపుమడుగులో పడిఉన్నారని వెంటనే పోలీసులకు ఫోన్ చేసినట్లు మొదటి అంతస్తులో ఉండే వ్యక్తి చెప్పాడు.