నేడు గూగుల్ హ్యాంగ్ఔట్ ద్వారా ప్రజలతో నటి రమ్య
బెంగళూరు: ప్రముఖ నటి, మాండ్య కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు రమ్య అలియాస్ దివ్య స్పందన గురువారం తన రాజకీయ కెరీర్, భవిష్యత్తు ప్రణాళికల పైన అభిమానులు, కార్యకర్తలతో గూగుల్ హ్యాంగ్ఔట్ ద్వారా సమాధానం చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న లోకసభ ఎంపీలలో రమ్య యంగెస్ట్ ఎంపి.
ఆమె గత ఏడాది మాండ్య ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలిచారు. ఆగస్టులో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె 47వేలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అభిమానులు, కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయి, వారు అడిగే ప్రశ్నలకు ఆమె హ్యాంగ్ఔట్ ద్వారా సమాధానం ఇస్తారు. ఈ కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం నుండి ప్రారంభం కానుంది.
కాగా, సినీ కథానాయికగా సత్తా చాటిన రమ్య దివ్య స్పందన అలియాస్ రమ్య ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. 2013లో కర్ణాటకలోని మాండ్య పార్లమెంటరీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆమె 15వ లోకసభకు ఎన్నికయ్యారు.
లోకసభలో తొలిసారి ప్రసంగించిన ఆమె రైతుల సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లి సీనియర్ల అభినందనలు అందుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలోను ఆమె కాంగ్రెసు పార్టీ టిక్కెట్ పైన మాండ్య నుండే పోటీ చేస్తున్నారు.