మరో ఫోటో: అంగారకుడి త్రీడి ఇమేజ్ పంపిన మామ్
బెంగళూరు: మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) తాజాగా అంగారకుడి త్రీడీ చిత్రాన్ని పంపించింది. మామ్లోని కలర్ కెమెరాను ఉపయోగించి మామ్ ఈ ఫోటోను తీసినట్లు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తన ఫేస్బుక్ పేజీలో పేర్కొంది. దీనిని ఇస్రో మంగళవారం ఫేస్బుక్ పేజీలో అప్ లోడ్ చేసింది.
కాగా, సెప్టెంబర్ 24వ తేదీన అంగారకుడిని చేరుకున్న మామ్ ఇప్పటి వరకు పలు చిత్రాలను పంపిన విషయం తెలిసిందే. అంగారకుడి ఉత్తరార్ధగోళంలో దూళి తుఫానుకు సంబంధించిన ఫోటోలను మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) రెండు రోజుల క్రితం పంపించింది. వాటిని అరుణ గ్రహ ఉపరితలానికి 74,500 కిలోమీటర్ల ఎత్తు నుండి తీసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పేర్కొంది. ఉపగ్రమంలోని మార్స్ కలర్ కెమెరా వీటిని క్లిక్మనిపించిందని తెలిపింది.
ఇప్పుడు అక్కడ చెలరేగిన దుమ్ము, ధూళితో కూడిన తుపానుకు సంబంధించిన ఫొటోను పంపింది. ప్రస్తుతం అంగారకుడిపై మీథేన్ జాడలను, ఖనిజాల లభ్యతను మామ్ వెతికే ప్రయత్నం చేస్తోంది. కాగా, భారత్ బుధవారం విజయవంతంగా అంగాకరకుడి కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) ఉపగ్రహం గురువారం నాడు అంగారకుడి పైన తొలి చిత్రాలను పంపించింది. మార్స్ ఆర్పిటార్ ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటోలను పోస్ట్ చేశారు.
అరుణ గ్రహ ఉపరితలాన్ని ఫోటో తీసి కంట్రోల్ సెంటర్కు పంపించింది. ఈ ఫోటోనే ఇస్రో వర్గాలు మామ్ ట్విట్టర్ అకౌంట్లో ఉంచాయి. దాని కింద 'ద వ్యూ ఈజ్ నైస్ అప్ హియర్' (ఇక్కడి నుంచి చూస్తే మార్స్ ఎంతో బాగుంది) అన్న క్యాప్షన్ కూడా ఉంది. ఈ చిత్రాన్ని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్తో పాటు శాస్త్రవేత్తల బృందం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి కానుకంగా అందచేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి ఇస్రో హైక్వాలిటీ పిక్చర్ను చూపించింది.