మణిపూర్ మహిళపై ఉమ్మేసి, జుట్టుపట్టి ఈడ్చాడు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మణిపూర్ కు చెందిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అకారణంగా ఆమెపై ఉమ్మివేయడంతో పాటు.. గొడవకు దిగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగి ఐదురోజులు కావస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఆందోళనకు దారితీసింది.
పోలీసుల నిర్లక్ష్యంపై మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో స్పందించిన పోలీసులు.. బాధితురాలి వాంగ్మూలం తీసుకుని, కేసునమోదు చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ముంబైలో బిజీగా ఉండే కలినా ప్రాంతంలో గత శనివారం సాయంత్రం స్నేహితురాలితో వెళుతున్న సదరు మహిళపై ఉమ్మివేశాడో వ్యక్తి. దీన్ని ప్రశ్నించిన ఆమెపై విరుచుకుపడ్డాడు.
నిరర్దాక్షిణ్యంగా కొట్టడం మొదలుపెట్టాడు. దీన్ని ప్రతిఘటించడంతో మరింత రెచ్చిపోయాడు. మహిళ పొట్టమీద తన్ని, జుట్టు పట్టి కిందపడేసి విచక్షణా రహితంగా పిడిగుద్దులు కురిపించాడు. చివరికి ఆమె ఒంటిపై ఉన్న దుస్తులను కూడా చించేసి ఉన్మాదిలా ప్రవర్తించాడు. అలా కొట్టుకుంటూ జుట్టు టుపట్టుకొని కొంతదూరం ఈడ్చి పారేశాడు.

ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన తర్వాత ఆమె స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా ఎన్సీ(నాన్ కాగ్నిజబుల్) కింద వదిలేశారు. తన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఆఫీసర్ ఇంఛార్జ్ తిరస్కరించడంతో పాటు తనను అవమానించారని బాధితురాలు వాపోయింది.
తనకు మరాఠీ తెలియదనీ, ఫిర్యాదు కాపీపై సంతకం మాత్రం చేశానని తెలిపింది. అటు దాడి గురించి చెప్పినప్పటికీ వినకుండా.. కనీస విచారణ చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలు సోదరి తెలిపింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం ఎన్సీగా పేర్కొనడం దారుణమన్నారు.
కాగా, ఈ ఘటనపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు.. బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మేకప్ ఆర్టిస్టుగా పని చేసే 26ఏళ్ల యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించినట్లు చెప్పారు. త్వరలోనే అతడ్ని పట్టుకుంటామని తెలిపారు.












Click it and Unblock the Notifications