బిజెపిలోకి ప్రధాని మన్మోహన్ సోదరుడు!: ఫ్యామిలీ షాక్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోదరుడు షాకిచ్చారు. ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. దేశంలో నరేంద్ర మోడీ హవా ఏమీ లేదంటూ మన్మోహన్ సింగ్ ప్రకటించి 24 గంటలు తిరక్క ముందే ఆయనకు వరుసకు సోదరుడయ్యే దల్జీత్ సింగ్ కోహ్లీ కమలతీర్థం పుచ్చుకున్నారు.
పంజాబ్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోడీ సమక్షంలోనే దల్జీత్ సింగ్ బిజెపిలో చేరడం కుటుంబ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ తమ పార్టీ సభ్యులను పెంచుకోదని సంబంధాలనే పెంచుకుంటుందని అన్నారు.

ఈ రోజు ప్రధాని మన్మోహన్ సోదరుడు బిజెపిలో చేరారని, ఆయన పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని మోడీ అన్నారు. వ్యాపారవేత్త అయిన దల్జీత్ సింగ్కు పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, అమృత్సర్లో పోటీ చేస్తున్న బిజెపి అబ్యర్థి అరుణ్ జైట్లీలు స్వాగతం పలికారు.
ఈ తాజా పరిణామం పట్ల మన్మోహన్ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారని, అయినా తన రాజకీయ భవిష్యత్తులో ముందుకెళ్లే స్వేచ్ఛ ఆయనకు ఉందంటూ పిఎంఓ వర్గాలు తెలిపాయి.
గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కలుసుకోవడమే జరగలేదని వెల్లడించాయి. వీరి మధ్య చాలాకాలంగా సంబంధాలు లేవన్నారు. మన్మోహన్కు సొంత అన్నదమ్ములు లేరని, ఆరుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారని, ఆయన తల్లి చిన్నతనంలోనే మృతి చెందారని తెలిపారు. దల్జీత్ సింగ్ ఆయనకు సవతి సోదరుడని పిఎంవో వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications