సుప్రీంకోర్టులో కరోనా కలకలం: సగం మంది ఉద్యోగులు ఇన్ఫెక్టెడ్: కేసుల విచారణ మాటేంటీ?
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం చెేలరేగింది. పలువురు సుప్రీంకోర్టు ఉద్యోగులకు కరోనా వైరస్ బారిన పడ్డారు. సగం మందికి పైగా ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు అనుమానిస్తోన్నారు. ఈ పరిణామాలతో సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ గంట ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. అన్ని బెంచ్ల వద్ద పిటీషన్ల విచారణ ఆలస్యంగా ఆరంభమౌతాయని సుప్రీంకోర్టు అదనపు రిజిస్ట్రార్ వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా బారిన పడ్డ ఉద్యోగులందరూ విధులకు గైర్హాజర్ కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
చాలావరకు ధర్మాసనాలు వర్చువల్ విధానంలో పిటీషన్లపై విచారణను చేపడతాయి. ఇప్పటిదాకా సుమారు 44 మంది సుప్రీంకోర్టు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు అధికారికంగా నిర్ధారించారు. మిగిలిన వారికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల రిపోర్టులు ఇంకా అందాల్సి ఉంది. ఆ రిపోర్టులు కూడా అందితే.. ప్రస్తుతం వైరస్ బారిన పడిన ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదనే అంచనా వ్యక్తమౌతున్నాయి. పలువురు న్యాయమూర్తులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేపట్టారు. ఇంటి నుంచే వర్చువల్ విధానంలో కేసులను విచారించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కావాల్సిన పొటీషన్ల విచారణ 11:30 గంటలకు ప్రారంభమౌతాయని అదనపు రిజిస్ట్రార్ వెల్లడించారు, 11 గంటలకు విచారణ చేపట్టాల్సిన బెంచ్లు మధ్యాహ్నం 12 గంటలకు తమ కార్యకలాపాలను చేపడతాయని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ విజృంభిస్తోన్నాయి. ఆదివారం నాటి బులెటిన్ ప్రకారం.. 10,774 కొత్త కేసులు రికార్డ్ అయ్యాయి. 48 మంది మరణించారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసులు 7,25,197కు చేరుకున్నాయి.
All the benches which are scheduled to sit at 10:30 am will sit at 11:30 am and those scheduled to sit at 11 am will sit at 12 noon in Supreme Court, today: Additional Registrar, DEU pic.twitter.com/rfRHH49xAC
— ANI (@ANI) April 12, 2021